Stock Market: ట్రంప్ దూకుడు... నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్

- వివిధ దేశాలపై టారిఫ్ పెంచిన ట్రంప్
- అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు
- భారత్ స్టాక్ మార్కెట్ సూచీలపై ప్రభావం
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ దూకుడైన నిర్ణయాలు తీసుకుంటుండడంతో ప్రపంచ వాణిజ్య రంగం కుదుపులకు గురవుతోంది. వివిధ దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై ట్రంప్ సుంకాలు పెంచడం అంతర్జాతీయ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. దాంతో, భారత స్టాక్ మార్కెట్ కూడా గత కొన్నిరోజులుగా ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు వీస్తుండడంతో, భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాల్లో ముగిశాయి. ఈ సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 319 పాయింట్లు నష్టపోయి 77,186 వద్ద ముగిసింది. నిఫ్టీ 121 పాయింట్లు కోల్పోయి 23,361 వద్ద స్థిరపడింది.
మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎయిర్ టెల్ షేర్లు లాభాల బాటలో పయనించగా... టాటా మోటార్స్, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, హిందూస్థాన్ యూనిలీవర్ షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.