Abhishek Sharma: అభిషేక్కు ముకేశ్ అంబానీ స్టాండింగ్ ఒవేషన్.. వైరల్ వీడియో!

- ఐదో టీ20లో భారీ సెంచరీతో చెలరేగిన అభిషేక్ శర్మ
- 37 బంతుల్లోనే శతకం బాదిన భారత యువ ఓపెనర్
- 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టిన అభిషేక్
- ఆ సమయంలో స్టేడియంలో ఉన్న ముకేశ్ అంబానీ స్టాండింగ్ ఒవేషన్
ఇంగ్లండ్తో ఆదివారం ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ భారీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. తొలి 50 పరుగులు చేయడానికి 17 బంతులు ఆడిన అభిషేక్, తర్వాతి 50 రన్స్ చేసేందుకు 20 బంతులు ఆడాడు. మొత్తంగా 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్లో ఏకంగా 13 సిక్సర్లు నమోదు కావడం చూస్తుంటే ఇంగ్లీష్ జట్టు బౌలర్లను అభిషేక్ ఎలా ఊచకోత కోశాడో అర్థం చేసుకోవచ్చు.
అయితే, అభి అర్ధశతకం చేసిన సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం దర్శనమిచ్చింది. మ్యాచ్ తిలకించేందుకు స్టేడియానికి వచ్చిన రిలయన్స్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ నిల్చుని మరీ చప్పట్లు కొట్టారు. ఇలా అంబానీ.. అభిషేక్కు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
కాగా, ఈ మ్యాచ్లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో 247 పరుగుల భారీ స్కోర్ చేసింది. ప్రత్యర్థి ఇంగ్లండ్కు 248 పరుగులు కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం 248 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 97 రన్స్కే ఆలౌట్ అయింది. దాంతో సూర్యకుమార్ సేన ఏకంగా 150 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ 5 టీ20ల సిరీస్ను 4-1తో కైవసం చేసుకుంది.