microsoft: అటువంటి ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ బిగ్ షాక్

- లెవల్ 80 వరకు ఉద్యోగుల పనితీరును ఇటీవల విశ్లేషించిన మైక్రోసాఫ్ట్
- ఉద్యోగులు తమ స్థాయికి తగిన కనీస పనితీరు ప్రమాణాలను అందుకోలేని కారణంగా తొలగిస్తున్నట్లు లేఖలు జారీ చేసిన మైక్రోసాఫ్ట్
- బిజినెస్ ఇన్సైడర్ పత్రికలో దీనిపై కథనం
అమెరికన్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు మరో సారి షాక్ ఇచ్చింది. ఇటీవలే సెక్యూరిటీ, డివైజ్, సేల్స్, గేమింగ్ విభాగాల్లోని ఉద్యోగులపై వేటు వేసిన మైక్రోసాఫ్ట్ .. తాజాగా పనితీరు మెరుగుపడని ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. ఈ విషయాన్ని బిజినెస్ ఇన్సైడర్ పత్రిక వెల్లడించింది.
కంపెనీలో జూన్ 2024 నాటికి 2.28 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, ఇటీవల లెవల్ 80 వరకు ఉద్యోగుల పనితీరును విశ్లేషించింది. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులను తక్షణమే కొలువుల నుంచి తప్పించిందని బిజినెస్ ఇన్సైడర్ కథనంలో పేర్కొంది. ఉద్యోగులు తమ స్థాయికి తగిన కనీస పనితీరు ప్రమాణాలను అందుకోలేని కారణంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వారికి పంపిన లేఖల్లో పేర్కొంది.
తొలగింపునకు గురైన వారికి మెడికల్, ప్రిస్ క్రిఫ్షన్, డెంటల్ హెల్త్ కేర్ ప్రయోజనాలు వెంటనే నిలిచిపోతాయని పేర్కొంది. కొందరు ఉద్యోగులకు సర్వీస్ పే కూడా చెల్లించనట్లు తెలుస్తోంది. తక్షణమే అన్ని విధుల నుంచి రిలీవ్ చేస్తున్నామని, మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్, అకౌంట్స్, బిల్డింగ్లలోకి యాక్సెస్ను తొలగించినట్లు తెలిపింది. అయితే ఎంత మంది ఉద్యోగులను తొలగించారనేది తెలియరాలేదు.
అంతే కాకుండా మళ్లీ ఇదే కంపెనీలో కొత్త ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే గతంలో ఆ ఉద్యోగి పనితీరు, టర్మినేషన్కు గురైన అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటామని వారికి మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.