Game changer: 'గేమ్ ఛేంజర్' తొలిరోజు కలెక్షన్ పోస్టర్ గురించి దిల్ రాజు ఏమన్నాడో తెలుసా?

- 'గేమ్ ఛేంజర్' వసూళ్లపై స్పందించిన 'దిల్'రాజు
- పంపిణీదారులతో ప్రెస్మీట్ పెట్టిన 'దిల్' రాజు
- 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం లాభాల పట్ల ఆనందం వ్యక్తం చేసిన పంపిణీదారులు
రామ్చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను దక్కించుకుంది. ఈ సినిమాపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఈ సినిమా విడుదలైన మరుసటి రోజు ఈ చిత్రం వసూళ్లపై విడుదల చేసిన పోస్టర్ చాలా విమర్శలకు గురైంది. ముఖ్యంగా... వచ్చిన కలెక్షన్స్కు సంబంధం లేకుండా కలెక్షన్ల పోస్టర్ వదిలారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదురయ్యాయి.
కాగా ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు నిర్మించిన మరో చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం'. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ముఖ్య తారలుగా తెరకెక్కిన ఈ చిత్రం కూడా సంక్రాంతికి విడుదలైంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ఆదరణ పొందింది. అయితే ఈ చిత్రం తమకు అందించిన లాభాలు తెలియజేయడానికి, ఈ చిత్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో పంపిణీ చేసిన డిస్ట్రిబ్యూటర్లు శనివారం ఓ ప్రెస్మీట్ను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నిర్మాత దిల్రాజు, దర్శకుడు అనిల్ రావిపూడి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
ఈ సందర్భంగా ''గేమ్ ఛేంజర్ తొలి రోజు వచ్చిన కలెక్షన్స్పై మీరు విడుదల చేసిన పోస్టర్.. మీరు విడుదల చేసిందా? లేక ఇంకా ఎవరైనా మీడియాకు పంపించారా?" అని ఓ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు దిల్ రాజు ఇచ్చిన సమాధానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దిల్ రాజు మాట్లాడుతూ ''మాకు వీక్నెస్లు ఉంటాయన్న సంగతి మీకు తెలుసు కదా. ఈ విషయంలో నేను మాట్లాడలేను. మాకు వీక్నెస్, అబ్లిగేషన్స్ ఉంటాయని కమిట్ అవుతున్నాం" అంటూ సమాధానం చెప్పారు.
"ఇప్పుడు అన్ని ఏరియాలో సినిమాలను పంపిణీ చేసే పంపిణీదారులు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ఉన్నారు. కానీ ఈ సినిమా సక్సెస్ విషయంలో పంపిణీదారులు అందరూ హ్యాపీగా ఉన్నారు" అని ఓ ప్రశ్నకు సమాధానంగా దిల్ రాజు చెప్పారు.
నెల్లూరు జిల్లాకు తాను 1 కోటి 60 లక్షలు పెట్టి కొన్నానని, కేవలం రెండు రోజుల్లోనే తాను రికవరీని చూశానని, ఈ సినిమా తమ ఏరియాలో తాను పెట్టిన రేటుకు నాలుగొందల శాతం ఎక్కువగా కలెక్ట్ చేసిందని డిస్ట్రిబ్యూటర్ హరి తెలిపారు.