Virat Kohli: రంజీల్లో కోహ్లీ... రోజుకు పారితోషికం ఎంతో తెలిస్తే షాకవుతారు!

- దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన రన్మెషీన్
- రైల్వేస్తో మ్యాచ్లో ఢిల్లీ తరఫున ఆడిన స్టార్ ప్లేయర్
- రోజుకు రూ. 60 వేల పారితోషికం పొందిన కోహ్లీ
- నాలుగు రోజులకు గాను మొత్తం రూ. 2.40 లక్షల పారితోషికం
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 12 ఏళ్ల తర్వాత రంజీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రైల్వేస్తో జరిగిన మ్యాచ్లో ఈ రన్మెషీన్ ఢిల్లీ తరఫున ఆడాడు. దాంతో అరుణ్ జైట్లీ స్టేడియానికి అతని కోసం అభిమానులు పోటెత్తారు. కానీ, ఈ మ్యాచ్లో బ్యాటింగ్కి దిగిన విరాట్... ఫ్యాన్స్ను తీవ్రంగా నిరాశ పరిచాడు.
15 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. హిమాన్షు సాంగ్వాన్ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు రైల్వేస్ను ఇన్నింగ్స్ 19 పరుగుల తేడాతో ఓడించింది. ఇంతవరకు బాగానే ఉంది. అసలు కోహ్లీ రంజీలు ఆడితే రోజుకు ఎంత పారితోషికం అందుకుంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
అతనికి రోజుకు రూ. 60 వేల పారితోషికం ఉంటుంది. అంటే... మ్యాచ్ జరిగే నాలుగు రోజులకు కలిపి రూ. 2.40 లక్షలు పారితోషికంగా లభిస్తుంది. కాగా, ఎవరైనా ప్లేయర్ రంజీల్లో 40 మ్యాచులకు పైగా ఆడితే రోజుకు రూ.60 వేలు జీతంగా అందుకుంటాడు. అదే 21 నుంచి 40 మ్యాచ్ లు ఆడితే రూ. 50 వేలు, 20 మ్యాచ్ ల కంటే తక్కువ ఆడితే రూ. 40 వేలు, అదే అరంగేట్ర ఆటగాడికైతే రూ. 20 వేల నుంచి రూ. 30 వేల వరకు ఇస్తారు.
అయితే, విరాట్ కోహ్లీ కేవలం 23 రంజీ ట్రోఫీ మ్యాచ్లు మాత్రమే ఆడినప్పటికీ, అతను 140 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లకు ప్రాతినిధ్యం వహించాడనే కారణంతో ఢిల్లీ వర్సెస్ రైల్వేస్ గేమ్కు రోజువారీగా అత్యధికంగా రూ. 60 వేల పారితోషికం పొందేందుకు అర్హత లభించింది.