Chiranjeevi: మన హైదరాబాద్కు విలువైన మొక్కలను తీసుకువచ్చారు: చిరంజీవి
![Chiranjeevi praises Ramdev Rao for Experium park](https://imgd.ap7am.com/thumbnail/cr-20250128tn6798b29bcc94b.jpg)
- రంగారెడ్డి జిల్లాలో 150 ఎకరాల్లో ఎక్స్పీరియం పార్క్ను తీర్చిదిద్దిన రాందేవ్ రావు
- పార్కును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. పాల్గొన్న చిరంజీవి
- తనకు రాందేవ్ రావు అరుదైన మొక్కలు ఇచ్చారని వెల్లడి
- రియల్ ఎస్టేట్ బిజినెస్ కాకుండా... పార్క్ను తీర్చిదిద్దారని కితాబు
విలువైన భూమి ఉంటే ఎవరైనా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుంటారని, కానీ రాందేవ్ రావు ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును ఏర్పాటు చేశారని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. హైదరాబాద్కు విలువైన మొక్కలను తీసుకువచ్చారన్నారు. రంగారెడ్డి జిల్లా పొద్దుటూరులో 150 ఎకరాల్లో రాందేవ్ రావు ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో 25 వేల జాతుల మొక్కలు ఉన్నాయి. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. ఈ పార్కులో రూ.1 లక్ష నుంచి రూ.3.5 కోట్ల విలువ చేసే అరుదైన వృక్షాలు ఉన్నాయి.
పలువురు ప్రముఖులు ఇక్కడి మొక్కలను కొనుగోలు చేశారు. రాందేవ్ రావు ఆరున్నరేళ్ల పాటు శ్రమించి ఎక్స్పీరియంను తీర్చిదిద్దారు. రాక్ గార్డెన్, 1500 మంది కూర్చునేలా యాంపీ థియేటర్ తదితరాలను ఏర్పాటు చేశారు. ఈ పార్కును ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ మాట్లాడుతూ... పొద్దుటూరు ప్రదేశం తనకు ముందే తెలుసన్నారు. తాను ఇల్లు కట్టుకున్నప్పుడు రాందేవ్ తనకు కొన్ని మొక్కలు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. మా ఇంట్లో పెంచుకుంటున్న ఆ మొక్కలను చూస్తే తనకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుందన్నారు. హైదరాబాద్కు ఇలాంటి మొక్కలను తీసుకురావడం అభినందనీయమన్నారు. రాందేవ్ తనకు వ్యాపారవేత్తలా కాకుండా కళాకారుడిలా కనిపించాడని కితాబునిచ్చారు.
"రాందేవ్తో నా పరిచయం ఇప్పటిది కాదు. ఈ ఎక్స్పీరియం పార్కుని మీ అందరి కంటే ముందుగా నేను చూశాను. 2000వ సంవత్సరంలోనే దీని గురించి రాందేవ్ నాతో పంచుకున్నారు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ వద్ద నుంచి మొక్కల్ని తెప్పించుకుంటూనే ఉన్నాను. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రాందేవ్ వద్ద నుంచి వచ్చినవే. రాందేవ్ ఓ వ్యాపారవేత్తగా ఎప్పుడూ ఆలోచించరు. పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచిస్తుంటారు. ఈ 150 ఎకరాలను వాణిజ్యంగానూ వాడుకోవచ్చు. కానీ ఆయన ఈ 25 ఏళ్లుగా రకరకాల మొక్కల్ని, వివిద దేశాల నుంచి కొత్త జాతి మొక్కల్ని ఇక్కడకు తీసుకొచ్చి ఈ పార్కుని నిర్మించారు. ఈ రకంగా రాం దేవ్ ఓ మంచి ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు.
ఈ ఎక్స్పీరియం పార్కుని చూసి నేను, గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు షాక్ అయ్యాం. ఇంత అద్భుతంగా ఉన్న ఈ పార్కుని చూసి షూటింగ్కు ఇస్తారా? అని రాందేవ్ను అడిగాను. ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే అయితే ఇస్తామని అన్నారు. కానీ ఈ ఎండలో నేను ఇక్కడ హీరోయిన్తో స్టెప్పులు వేయడం అంటే కాస్త కష్టమే. వర్షాకాలం తరువాత ఇక్కడ మరింత పచ్చదనం వస్తుంది. ఆ టైంలో షూటింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. వెడ్డింగ్, రిసెప్షన్, ఇతర కార్యక్రమాలకు ఈ చోటు అనువైనదిగా ఉంటుంది.
దేశవిదేశాల్లో ఉండే ఎన్నో అరుదైన జాతి మొక్కల్ని ఒక చోటకు చేర్చి ఇంత అద్భుతమైన పార్కుని రాం దేవ్ నిర్మించారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం అభినందనీయం. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి ప్రకృతి, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకు రావడం ఆనందంగా ఉంది" అని చిరంజీవి వివరించారు.
ఇలాంటి ప్రదేశానికి ప్రభుత్వం నుంచి కూడా సహకారం ఉండాలన్నారు. ఈ పార్క్ మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.