republic day celebration: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఇలా

- ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నగరంలో ట్రాఫిక్ డైవర్షన్
- గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు రాక నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు
- ఆర్టీసీ బస్సుల రూట్లలో కూడా పోలీసుల మళ్లింపులు
గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ రోజు ఆదివారం విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు.
ఉదయం 7 గంటల నుండి కంట్రోల్ రూమ్ వైపు నుండి బెంజ్ సర్కిల్ వైపుకు వెళ్ళు అన్నీ వాహనాలను ఆర్టీసీ వై జంక్షన్ నుండి ఏలూరు రోడ్ మీదుగా స్వర్ణ ప్యాలస్, దీప్తి సెంటర్, చుట్టుగుంట, పడవలరేవు, గుణదల, రామవరప్పాడు రింగ్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపుకు మళ్లించనున్నారు. ఆర్టీసీ వై జంక్షన్ నుండి బందర్ లాకులు, రాఘవయ్య పార్క్, పాత ఫైర్ స్టేషన్ రోడ్, అమెరికన్ హాస్పిటల్, మసీద్ రోడ్, నేతాజీ బ్రిడ్జ్, గీతానగర్, స్క్యూ బ్రిడ్జ్ మీదుగా బెంజ్ సర్కిల్ వైపుకు పంపించనున్నారు.
బెంజ్ సర్కిల్ వైపు నుండి బందర్ రోడ్ లోనికి వచ్చు వాహనాలను బెంజ్ సర్కిల్ నుండి ఫకీర్ గూడెం, స్క్యూ బ్రిడ్జ్, నేతాజీ బ్రిడ్జ్, బస్టాండ్ వైపుకి మళ్లించనున్నారు.
రెడ్ సర్కిల్ నుండి ఆర్టీఏ జంక్షన్, శిఖామణి సెంటర్ నుండి వెటర్నరీ జంక్షన్ వరకు ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు.
బెంజ్ సర్కిల్ నుండి డి.సి.పి బంగ్లా కూడలి వరకు (యం.జి రోడ్ నందు) ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆహ్వానితులను మాత్రమే అనుమతిస్తారు.
ఆర్టీసీ సిటీ బస్సులు మళ్లింపులు ఇలా..
- ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆర్టీసీ “వై” జంక్షను నుండి బెంజ్ సర్కిల్ వైపుకు ఆర్టీసీ బస్సులు అనుమతించబడవు.
- ఆర్టీసీ “వై” జంక్షను నుండి బందరు రోడ్డు, రూట్.నెం.5 లో వెళ్ళు ఆర్టీసీ సిటీ బస్సులు ఏలూరు రోడ్డు మీదుగా రామవరప్పాడు రింగ్ వరకు వెళ్ళి అక్కడ నుండి బెంజ్ సర్కిల్ వైపుకు మళ్లిస్తారు.
ఆహ్వానితులకు ప్రత్యేక సూచనలు..
- ఏఏ పాస్ కలిగిన వారు గేట్ నం.3 (బందర్ రోడ్డు ) నుండి ప్రవేశించి అక్కడే నిర్దేశించబడిన స్థలములో వాహనాలు పార్కింగ్ చేయవలెను.
- ఏ1 పాస్ కలిగిన వారు గేట్ నం.4 (మీ సేవ వద్ద ఉన్నది) ద్వారా లోపలికి ప్రవేశించి వారి వాహనములను హ్యాండ్ బాల్ గ్రౌండ్ నందు పార్కింగ్ చేయవలెను.
- బీ 1 పాస్ కలిగిన పురస్కార గ్రహీతలు, వారి కుటుంబ సభ్యులు పాస్ కలిగిన వారు గేట్ నెం. 6 ద్వారా ప్రవేశించి ఫుట్ బాల్ గ్రౌండ్ నందు లేదా స్టేడియంకు ఎదురుగా ఉన్న ఆర్మ్డ్ రిజర్వు గ్రౌండ్ నందు పార్క్ చేయవలెను.
- ఏఐఎస్ అధికారులు, మీడియా ప్రతినిధులు గేట్ నెం.2 ద్వారా స్టేడియం లోపలికి అనుమతించబడును.
- సాధారణ ప్రజలు, స్కూల్, కాలేజి విద్యార్ధులు గేటు నెంబర్ 5, 6 ద్వారా లోపలికి ప్రవేశం ఉంటుంది.
- పాసులు కలిగిన ఆహ్వానితులు ఉదయం గం.7.45 లోపు స్టేడియంలోనికి చేరుకోవాలి.
స్కూల్, కాలేజీ విద్యార్ధులు వచ్చు బస్సులకు..
- విజయవాడ, నున్న, సింగ్ నగర్, సత్యనారాయణపురం, మాచవరం వైపు నుండి వచ్చు బస్సులు ఏలూరు రోడ్డు సీతారామపురం సిగ్నల్ జంక్షన్ (దీప్తి జంక్షన్) నుండి పుష్ప హోటల్ రెడ్ సర్కిల్ వరకు వచ్చి బిషప్ అజరయ్య స్కూల్ గ్రౌండ్ నందు గానీ, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ నందు పార్క్ చేయాలి.
- విజయవాడ పటమట వైపు నుండి వచ్చు బస్సులు బెంజ్ సర్కిల్ వచ్చి, బందరు రోడ్డు మీదుగా వెటర్నరీ జంక్షన్ వరకు వచ్చి.. అక్కడ విద్యార్థులను దింపి బస్సులను బందర్ రోడ్డులో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ నందు పార్క్ చేయాలి.