cruise ship: విశాఖ హార్బర్ కు క్రూయిజ్ షిప్... ఎప్పుడంటే...!

cruise ship coming to visakhapatnam port in august

  • పోర్టు యాజమాన్యం కీలక ప్రకటన 
  • ఆగస్టు 4 నుంచి 22 తేదీల మధ్య క్రూయిజ్ షిప్ నడపనున్నట్లు వెల్లడి
  • కార్డేలియా క్రూయిజ్ షిప్ పుదుచ్చేరి నుంచి చెన్నై మీదుగా విశాఖకు రాక

కార్డేలియా క్రూయిజ్ షిప్ విశాఖపట్నం రాకకు ముహూర్తం ఫిక్స్ అయింది. విశాఖపట్నం పోర్టు నుంచి క్రూయిజ్ షిప్ రాకపోకలపై కీలక ప్రకటన వెలువడింది. విశాఖను అంతర్జాతీయ పర్యాటక యవనికపై నిలిపే క్రూయిజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది. కేంద్ర పర్యాటక శాఖ విడుదల చేసిన రూ.38.50 కోట్లు, విశాఖ పోర్టు ట్రస్ట్ రూ.57.55 కోట్లు మొత్తం రూ.96.05 కోట్లతో వైజాగ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ (ఐసీటీ) నిర్మించారు. రెండువేల మందిని తీసుకెళ్లగల సామర్థ్యం గల క్రూయిజ్ లు నిలిపేందుకు వీలుగా ఈ టెర్మినల్ సిద్ధం చేశారు. 

ఈ టెర్మినల్‌లో కస్టమ్స్ అండ్ ఇమిగ్రేషన్ సేవా కౌంటర్లు, రిటైల్ అవుట్ లెట్లు, డ్యూటీ ఫ్రీ షాపులు, ఫుడ్ కోర్టులు, లాంజ్‌లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్ నెలలో ప్రపంచంలోని అతి పెద్ద లగ్జరీ క్రూయిజ్ షిఫ్ వచ్చి ఇక్కడ పర్యాటకులకు కనువిందు చేసింది. పూర్తి హంగులతో క్రూయిజ్ టెర్మినల్ సిద్ధమైన నేపథ్యంలో విశాఖపట్నం పోర్టు అథారిటీ కార్యదర్శి టి. వేణుగోపాల్ శుక్రవారం క్రూయిజ్ షిప్ సర్వీసులపై ప్రకటన విడుదల చేశారు. 

పోర్టు యాజమాన్యం కృషి ఫలించిందని తెలిపారు. కార్డేలియా క్రూయిజ్ షిప్ పుదుచ్చేరి నుంచి చెన్నై మీదుగా విశాఖపట్నం మధ్య ఆగస్టు 4 నుంచి 22 వరకు మూడు సర్వీసులు నడిపేందుకు సన్నాహాలు చేసుకుంటోందని వెల్లడించారు. జీఏసీ షిప్పింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ఈ సర్వీసుకు షిప్పింగ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.    

  • Loading...

More Telugu News