Kishan Reddy: తెలంగాణ కంపెనీలనే దావోస్ కి తీసుకెళ్లి ఒప్పందాలు చేసుకున్నారు: కిషన్ రెడ్డి

- ఒప్పందాలు పేపర్లకే పరిమితం కాకూడదన్న కిషన్ రెడ్డి
- క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభం కావాలని వ్యాఖ్య
- కాంగ్రెస్ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తోందని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ కంపెనీలనే దావోస్ కు తీసుకెళ్లి అక్కడ ఎంవోయూలు చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానం తనకు ఏమీ అర్థం కాలేదని అన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు రావాలని చెప్పారు. దావోస్ లో చేసుకున్న ఒప్పందాలు కేవలం పేపర్లకే పరిమితం కాకూడదని... క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభం కావాలని అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొందరు వ్యాపారవేత్తలపై పక్షపాతం చూపిందని... ఈ ప్రభుత్వం అందరినీ వేధిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వేధించని పారిశ్రామికవేత్త ఒక్కరు కూడా లేరని అన్నారు. మరోవైపు, దావోస్ పర్యటనను ముగించుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల్లో మేఘా కంపెనీ ఒప్పందం కూడా ఉండటం విమర్శలకు దారితీసింది.