Nara Lokesh: ప్రభుత్వ పాఠశాలలో నా బర్త్ డే వేడుకలు నిర్వహించడం మనస్థాపానికి గురిచేసింది: నారా లోకేశ్

- నిన్న నారా లోకేశ్ పుట్టినరోజు
- జంగారెడ్డిగూడెం జడ్పీ స్కూల్లో విద్యార్థులతో లోకేశ్ బర్త్ డే వేడుకలు
- స్కూళ్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలన్న లోకేశ్
- బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు
ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిన్న (జనవరి 23) పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే, ఓ ప్రభుత్వ హైస్కూల్లో తన జన్మదిన వేడుకలు నిర్వహించడం పట్ల లోకేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
"రాష్ట్రంలోని పాఠశాలలు, విశ్వ విద్యాలయాలను రాజకీయాలకు అతీతంగా తీర్చిదిద్దాలని చంద్రబాబు గారి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం జడ్పీ స్కూలులో విద్యార్థులతో నా బర్త్ డే వేడుకలు నిర్వహించినట్లు వచ్చిన వార్త నన్ను మనస్థాపానికి గురిచేసింది. ఇందుకు బాధ్యులైన వారిపై వెనువెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించాను. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలని వారిని కోరుతున్నాను" అంటూ లోకేశ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.