Hardik Pandya: భువనేశ్వర్ కుమార్ ను దాటేసిన హార్దిక్ పాండ్యా

- నిన్నటి ఇంగ్లండ్ మ్యాచ్ లో 2 వికెట్లు తీసిన పాండ్యా
- దీంతో టీ20ల్లో 91కి చేరిన అతని మొత్తం వికెట్ల సంఖ్య
- ఈ జాబితాలో 97 వికెట్లతో అర్ష్దీప్ సింగ్ అగ్ర స్థానం
- రెండో స్థానంలో చాహల్ (96).. మూడో స్థానంలో పాండ్యా
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పేసర్లు భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రాలను హార్దిక్ పాండ్యా దాటేశాడు. ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నిన్న ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మొదటి మ్యాచ్లో పాండ్యా 2 వికెట్లు తీశాడు. దీంతో టీ20ల్లో అతని మొత్తం వికెట్ల సంఖ్య 91కి చేరింది. ఈ క్రమంలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలోని భువనేశ్వర్ (90), బుమ్రా (89) లను అతను అధిగమించాడు.
కాగా, ఈ జాబితాలో అర్ష్దీప్ సింగ్ 97 వికెట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో యుజ్వేంద్ర చాహల్ (96) ఉంటే.. 91 వికెట్లతో పాండ్యా మూడో స్థానాన్ని ఆక్రమించాడు. ఆ తర్వాత వరుసగా నాలుగు, ఐదో స్థానంలో భువనేశ్వర్ (90), బుమ్రా (89) ఉన్నారు.
ఇక హార్దిక్ పాండ్యా 2016 జనవరిలో ఆస్ట్రేలియాపై మ్యాచ్తో పొట్టి ఫార్మాట్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 110 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో 1,700 పరుగులు చేసి, 91 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల్లో అతను 86 మ్యాచ్లలో 1,769 పరుగులు, 84 వికెట్లు సాధించాడు. అలాగే 11 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. కానీ, 2021 నుంచి టెస్ట్ జట్టులో పాండ్యాకు చోటు దక్కలేదు.
2022 జూన్ లో ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియాకు కెప్టెన్గా వ్యవహరించాడు. దాంతో పొట్టి ఫార్మాట్కు పాండ్యానే శాశ్వత కెప్టెన్ అని అందరూ భావించారు. 2024 టీ20 ప్రపంచకప్ సమయంలోనూ అతను వైస్-కెప్టెన్గా ఉన్నాడు. కానీ, ఆ తర్వాత అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ కొత్త టీ20 కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించాడు.