Nithya Menen: సినిమా రంగం నాకు ఇష్టం లేదు: నిత్యా మేనన్

- ఒత్తిడి లేకుండా జీవించాలనేది తన కోరిక అన్న నిత్య
- మరో రంగంలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించానని వెల్లడి
- జాతీయ అవార్డు తన ఆలోచనలను మార్చిందని వివరణ
మలయాళ భామ నిత్యా మేనన్ కు దక్షిణాదిలోనే కాదు... బాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు ఉంది. తాజాగా ఓ ఇంటర్య్వూలో నిత్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమా రంగం అంటేనే ఇష్టం లేదని ఆమె చెప్పారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవితాన్ని అనుభవించాలనేది తన కోరిక అని... ఏదైనా అవకాశం వస్తే మరో రంగంలోకి వెళ్లాలని కూడా ప్రయత్నించానని తెలిపారు. అయితే జాతీయ అవార్డు తన ఆలోచనలను మార్చిందని చెప్పారు. ఉత్తమ నటిగా తాను అందుకున్న పురస్కారం తన సినీ జీవితానికి ఒక మార్గాన్ని చూపించిందని అన్నారు.
మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నిత్యా మేనన్ నటించాల్సి ఉంది. నిత్య కథానాయికగా జయలలిత బయోపిక్ చేస్తున్నట్టు 2019లో ప్రియదర్శిని అనే యువ దర్శకురాలు ప్రకటించారు. 'ది ఐరన్ లేడీ' అనే టైటిల్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇది జరిగి ఐదేళ్లు దాటుతున్నా సినిమా మాత్రం పట్టాల పైకి ఎక్కలేదు.
జయ బయోపిక్ పై నిత్య మాట్లాడుతూ... బయోపిక్ చేయాలని తాము ఎంతో ఆశపడ్డామని చెప్పారు. అయితే తాము సినిమాను ప్రకటించిన తర్వాత అదే కథతో 'తలైవి' అనే మూవీ వచ్చిందని తెలిపారు. కొంత కాలానికి 'క్వీన్' పేరుతో వెబ్ సిరీస్ వచ్చిందని చెప్పారు. ఈ రెండు విడుదలయ్యాక... తాము సినిమా చేస్తే రిపీట్ చేసినట్టు అవుతుందని... అందుకే ఆ సినిమాను పక్కన పెట్టేశామని తెలిపారు.