Telangana: ఒక అరటిపండు రూ.100 చెప్పిన హైదరాబాదీ వ్యాపారి.. ఆశ్చర్యపోయిన రష్యన్ యాత్రికుడు... ఇదిగో వీడియో

- హైదరాబాద్లో రష్యన్ యాత్రికుడికి వింత అనుభవం
- ఒక అరటిపండు ఎంత అని తోపుడు బండ్ల వ్యాపారిని అడిగిన రష్యన్
- ఎన్నిసార్లు అడిగినా ఒక అరటిపండు విలువ రూ.100 అన్న వ్యాపారి
- అంత ధర చెల్లించలేనంటూ ముందుకు కదిలిన రష్యన్
మనం అరటిపండ్లను డజన్ లెక్కన కొనుగోలు చేస్తాం. ప్రస్తుతం మార్కెట్లో డజన్ అరటిపండ్ల ధర రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. అయితే హైదరాబాద్ నగరంలో ఓ రష్యన్ యాత్రికుడికి వింత అనుభవం ఎదురైంది. ఓ తోపుడు బండ్ల వ్యాపారి ఒక అరటిపండు ధరనే అతనికి రూ.100గా చెప్పాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను సదరు రష్యన్ యాత్రికుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో... రష్యన్ యాత్రికుడు తోపుడు బండ్ల వ్యక్తి వద్దకు నమస్కారం చెబుతూ వెళ్లాడు. ఒక అరటిపండు ఎంత అని అడిగాడు. దానికి ఆ వ్యాపారి రూ.100 అని చెప్పాడు. నేను ఒక్క అరటిపండు ధరను అడుగుతున్నానని పలుమార్లు ఆ రష్యన్ అడిగినప్పటికీ... వంద రూపాయలు అని ఆ వ్యాపారి కరాఖండీగా చెప్పాడు. అయితే అంత ధరను తాను చెల్లించలేనంటూ సదరు యాత్రికుడు అక్కడి నుంచి ముందుకు కదలడం వీడియోలో చూడొచ్చు.
క్రేజీ ప్రైస్ అంటూ వీడియోలో అతను పేర్కొన్నాడు. ఈ ధరతో యూకేలో ఎనిమిది అరటిపండ్లు కొనుగోలు చేయవచ్చు.. కానీ ఇక్కడ మాత్రం ఒక్కటే అంటున్నారని పేర్కొన్నాడు. నేను ఒకే అరటిపండుకు ధర అడిగిన విషయం సదరు వ్యాపారికి అర్థమైందనే అనుకుంటున్నానని ఆ రష్యన్ టూరిస్టు పేర్కొన్నాడు.