Tirumala: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు... సప్తగిరి టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్

- రేపటితో ముగుస్తున్న వైకుంఠ ద్వార దర్శనాలు
- దీంతో అనూహ్యంగా పెరిగిన భక్తులు
- రోజుకు 70 వేల మందికి వైకుంఠ దర్శనం కల్పించేందకు ఏర్పాట్లు
తిరుమలకు వెళుతున్న భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో అలిపిరి వద్ద ఉన్న సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు బారులు తీరాయి. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రేపటితో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగియనుండటంతో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. రేపు అర్ధరాత్రి శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాలను టీటీడీ మూసివేయనుంది. దీంతో, వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు కొండపైకి భారీగా చేరుకుంటున్నారు.
ఈరోజు, రేపు దర్శనాలకు సంబంధించి 50 వేల టోకెన్లను టీటీడీ ముందస్తుగా జారీ చేసింది. ఆన్ లైన్ లో 15 వేల ప్రత్యేక దర్శనం టికెట్లను కూడా జారీ చేసింది. రోజుకు 70 వేల మందికి వైకుంఠ దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది.