Chandrababu: టెక్నాలజీ మనుషులను ఎక్కడికో తీసుకెళ్లింది: చంద్రబాబు

- సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం
- గతంలో తాను టెక్నాలజీ గురించి మాట్లాడితే హేళన చేశారని వెల్లడి
- ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి వచ్చిందని వివరణ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి జీవనాడి అని అన్నారు. కానీ గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేశారని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అమరావతిని కూడా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా వెనుకాడే పరిస్థితి నెలకొందని తెలిపారు.
గతంలో తాను టెక్నాలజీ గురించి, ఐటీ గురించి మాట్లాడితే అవహేళన చేశారని, కానీ ఇవాళ అదే టెక్నాలజీ తిండి పెట్టడం కాదు... మనుషులను ఎక్కడికో తీసుకెళుతోందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇప్పటిరోజుల్లో సెల్ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొందని అన్నారు.
అప్పట్లోనే రెండో తరం ఆర్థిక సంస్కరణల గురించి ఆలోచించానని, మలేసియాలో మెరుగైన రోడ్లను చూసి, భారత్ లోనూ అలాంటి రోడ్లు ఉండాలని అప్పటి ప్రధాని వాజ్ పేయికి వివరించానని చంద్రబాబు గుర్తుచేశారు. నిధులు ఎక్కడ్నించి వస్తాయని వాజ్ పేయి అన్నారని, దాంతో ఆయనకు రోడ్ల నిర్మాణంలో అనుసరించే వివిధ పద్ధతులు వివరించానని చెప్పారు. ఇప్పుడు ఫోర్ లేన్, సిక్స్ లేన్, 14 లేన్ల రహదారులు కూడా వచ్చాయని అన్నారు.
హైదరాబాదుకు 160 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు, 5 వేల ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు తీసుకువచ్చామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ద్వారానే అత్యధిక ఆదాయం వస్తోందని తెలిపారు.
"ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అభివృద్ధి చేసి, సంపద సృష్టించి, పెరిగిన ఆదాయంతో మళ్లీ అభివృద్ధి చేస్తూనే, సంక్షేమ పథకాలకు నాంది పలికి, సాధికారతకు నిరంతరం చర్యలు తీసుకుంటామని చెప్పాం. ఇప్పుడు విజన్ 2047ని నిర్దేశించుకున్నాం. అందులో నిర్దిష్టమైన అంశాలకు స్థానం కల్పించాం. ఒక వ్యక్తి పూర్తిగా ఆనందంగా ఉంటే ఆ వ్యక్తి కుటుంబం పూర్తిగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది.
గతంలో తల్లిదండ్రులను వారి పిల్లలు సరిగ్గా చూసుకోలేని పరిస్థితి ఉండేది. ఇవాళ మేం పెన్షన్ ఇచ్చాం... దాంతో వృద్ధులను చూసుకోవడానికి వారి పిల్లలు సిద్ధంగా ఉన్నారు. అన్ని సంస్కృతుల కంటే మన సంస్కృతి ఎక్సట్రార్డినరీ. కుటుంబ వ్యవస్థ వల్ల భద్రత చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇటువంటి పటిష్టమైన వ్యవస్థ మన భారతదేశానికి మాత్రమే ఉంది.
ఆధార్ వంటి వ్యవస్థ ఎక్కడా లేదు. భారత్ కు ఇదొక అడ్వాంటేజి. ప్రతి ఒక్క వ్యక్తిని ఆధార్ ద్వారా గుర్తించవచ్చు. గతంలో నేను ఏమేం చెప్పానో అవన్నీ ఇప్పుడు అమలులో ఉన్నాయి.
ఇప్పుడు విజన్ డాక్యుమెంట్-2047ని తీసుకువస్తున్నాం. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడమే ఏపీ లక్ష్యం. 2047 నాటికి తలసరి ఆదాయం 42 వేల డాలర్లకు చేరాలి. ఈ లక్ష్యాలను సాకారం చేసేందుకు ప్రజలను భాగస్వామ్యం చేసుకుని ముందుకు వెళుతున్నాం" అని వివరించారు.