ACB: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏస్ నెక్స్ట్ జెన్కు ఏసీబీ నోటీసులు

- ఈ-రేస్ కేసులో తొలి ప్రమోటర్గా ఉన్న ఏస్ నెక్స్ట్ జెన్
- ఈ నెల 18న విచారణకు హాజరు కావాలని ఆదేశం
- ఇప్పటికే కేటీఆర్ సహా పలువురిని విచారించిన ఏసీబీ
ఫార్ములా ఈ-రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రేస్ నిర్వహణలో తొలి ప్రమోటర్ ఏస్ నెక్స్ట్ జెన్కు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించింది.
2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందం ప్రకారం సీజన్ 9, 10, 11, 12 రేస్ల నిర్వహణ ఖర్చులను ఏస్ నెక్స్ట్ జెన్ భరించాలి. హైదరాబాద్లో 2023 ఫిబ్రవరిలో సీజన్ -9 రేస్ జరిగింది. 2024 ఫిబ్రవరిలో జరగాల్సిన సీజన్-10 రేస్ కోసం ఫార్ములా ఈ-రేస్ ఆపరేషన్స్ సంస్థకు 2023 మే నెలలో 50 శాతం సొమ్ము అంటే రూ.90 కోట్లు చెల్లించవలసి ఉన్నప్పటికీ ఏస్ నెక్స్ట్ జెన్ ముందుకు రాలేదు. సీజన్-9తోనే తమకు నష్టం వాటిల్లిందంటూ చేతులెత్తేసింది.
దీంతో ప్రమోటర్ పాత్రను హెచ్ఎండీఏ పోషించాలని నాటి మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీంతో 2023 అక్టోబర్ నెలలో రూ.45.71 కోట్లను ఎఫ్ఈవోకు హెచ్ఎండీఏ బదిలీ చేసింది. ఈ వ్యవహారమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. బాధ్యతల నుంచి తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ మీద ఎలాంటి చర్య తీసుకోకపోవడంపై ఏసీబీ ఆరా తీస్తోంది.