Harish Rao: సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: హరీశ్ రావు

- రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటూ రైతులను దగా చేస్తోందన్న హరీశ్ రావు
- రైతులు కలిసికట్టుగా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపు
- ప్రభుత్వం మెడలు వంచి రావాల్సిన పథకాలు సాధించాలని వ్యాఖ్య
రైతులకు ఇచ్చిన హామీలపై మాట తప్పినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటూ రైతులను దగా చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న అన్యాయానికి గాను రైతులంతా కలిసికట్టుగా ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం మెడలు వంచి రావాల్సిన పథకాలను సాధిద్దామన్నారు. ఎకరంలోపు భూమి ఉంటే వారిని కూలీలుగా గుర్తించి రూ.12 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పడంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గోబెల్స్ను మించి పోతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.