Road Accident: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం

- తిరుపతి నుంచి తిరుమల వెళుతున్న ఆర్టీసీ బస్సు
- హరిణి వనం దాటిన తర్వాత అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టిన వైనం
- రోడ్డుపైనే నిలిచిపోయిన బస్సు... కిలోమీటరు మేర నిలిచిన ట్రాఫిక్
- పొక్లెయిన్ సాయంతో బస్సును తొలగించిన టీటీడీ సిబ్బంది
తిరుమల రెండో ఘాట్ రోడ్డులో నేడు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళుతున్న ఆర్టీసీ బస్సు హరిణి వనం దాటిన తర్వాత అదుపుతప్పి ఘాట్ రోడ్డు పక్కన ఉన్న పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.
బస్సు ప్రమాదంతో రెండో ఘాట్ రోడ్డుపై కిలోమీటరు వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన టిటీడీ అధికారులు... పొక్లెయిన్ సాయంతో బస్సును తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.
కాగా, పిట్టగోడ బలంగా ఉండడంతో బస్సు రోడ్డుపైనే నిలబడిందని, లేకుంటే, పక్కనే ఉన్న భారీ లోయలో పడి పెను ప్రమాదం జరిగేదని భక్తులు భయాందోళనలు వ్యక్తం చేశారు.