Manchu Vishnu: గొప్ప మనసును చాటుకున్న మంచు విష్ణు.. 120 మంది అనాథలను దత్తత తీసుకున్న వైనం

- తిరుపతిలోని మాతృశ్య సంస్థలో అనాథలను దత్తత తీసుకున్న విష్ణు
- ఒక అన్నగా వీరికి అన్ని విషయాల్లో అండగా ఉంటానని వెల్లడి
- అందరూ అనాథలకు సాయం చేయాలని విన్నపం
హీరో మంచు విష్ణు చేసిన ఒక మంచి పనికి అందరూ హ్యాట్సాఫ్ చెపుతున్నారు. తిరుపతిలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఉండే మాతృశ్య సంస్థకు చెందిన 120 మంది అనాథలను విష్ణు దత్తత తీసుకున్నారు. విద్య, వైద్యంతో పాటు అన్ని విషయాల్లో వీరికి తాను ఒక అన్నగా అండగా ఉంటానని ఈ సందర్భంగా విష్ణు తెలిపారు.
ఎలాంటి స్వలాభం లేకుండా మాతృశ్య సంస్థ నిర్వాహకురాలు శ్రీదేవి 120 మంది అనాథలను ఆదరిస్తున్నారని మంచు విష్ణు కొనియాడారు. వారితో పండుగను జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని అనాథలకు సాయం చేయాలని కోరారు.
మరోవైపు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు, విష్ణు, ఇతర కుటుంబ సభ్యులు ఈ ఉదయం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణు స్పందిస్తూ... అందరూ బాగుండాలని అన్నారు. సంక్రాంతి అంటేనే రైతు అని... రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పారు. ప్రజలంతా బాగుండాలని, కరవు కాటకాలు రాకూడదని, రైతు బాగుండాలని కోరుకుంటున్నాని అన్నారు. అందరూ జాగ్రత్తగా పండుగ చేసుకోవాలని చెప్పారు.