California Wildfires: లాస్ ఏంజెలెస్‌లో కార్చిచ్చు.. ఇళ్లను కాపాడుకునేందుకు రోజుకు రూ. 40 లక్షలు ఖర్చు చేస్తున్న సెలబ్రిటీలు

California Wildfires 16dead

  • కాలిఫోర్నియాను బుగ్గి చేస్తున్న దావానలం
  • శక్తికి మించి కష్టపడుతున్న అగ్నిమాపక దళం
  • వేధిస్తున్న నీటి కొరత.. సెలబ్రిటీలపై సామాన్యుల మండిపాటు
  • నీటి కొరత ఉన్నా విచ్చలవిడిగా వాడేస్తున్నారని ఆగ్రహం
  • నిబంధనలకు మించి 8 లక్షల లీటర్ల నీటిని అధికంగా వాడిన నటి కిమ్ కర్దాషియన్
  • కార్చిచ్చు కారణంగా 16 మంది మృతి.. 12,300 ఇళ్లు, వ్యాపార సముదాయాల బుగ్గి

‘సిటీ ఆఫ్ ఏంజెల్స్’గా పిలిచే లాస్ ఏంజెలెస్ ఇప్పుడు కార్చిచ్చుతో అంద విహీనంగా మారింది. కాలిఫోర్నియాలోని మొత్తం ఆరు చోట్ల దావానలం మొదలు కాగా, లాస్ ఏంజెలెస్‌లో మొదలైన ‘ప్యాలిసేడ్స్ వైల్డ్‌ఫైర్’ విధ్వంసం సృష్టిస్తోంది. నిర్మాణాలను బుగ్గి చేస్తోంది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపకశాఖకు శక్తి సరిపోవడం లేదు. దీనికితోడు నీటి కొరత వేధిస్తోంది. మరోవైపు, హాలీవుడ్ నటులు తమ ఇళ్లను కాపాడుకునేందుకు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. రోజుకు దాదాపు రూ. 40 లక్షల వరకు ఖర్చు చేసేందుకు రెడీ అంటున్నారు. 

ఈ నేపథ్యంలో హాలీవుడ్ నటుల తీరుపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీటి కొరత ఉన్నప్పటికీ వారు విచ్చలవిడిగా వాడేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలను సైతం బేఖాతరు చేస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటి సంరక్షణ కోసం 2022లో ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఇంటి చుట్టూ ఉండే మొక్కలు, పచ్చికకు వారానికి రెండుసార్లు మాత్రమే, అది కూడా ఒక్కోసారి 8 నిమిషాలకు మించి నీరు పట్టకూడదన్నది నిబంధనల్లో ఒకటి. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా హెచ్చరించింది. 

అయితే, కిమ్ కర్దాషియన్, సిల్వెస్టర్ స్టాలోన్, ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్, పారిస్ హిల్టన్, బిల్లీ క్రిస్టల్, ఆంథోనీ హాప్కిన్స్, మెల్ గిబ్సన్ వంటి నటులు నీటిని విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. నటి కిమ్ కర్దాషియన్ అయితే వాడాల్సిన దానికంటే 8 లక్షల లీటర్లకుపైగా అదనంగా నీటిని వాడారు. సామాన్యులు నీటి కొరతతో ఇబ్బంది పడుతుంటే సెలబ్రిటీలు మాత్రం ఇలా విచ్చలవిడిగా నీటిని వాడటంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కార్చిచ్చు కారణంగా లక్షలాదిమంది తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతుంటే సెలబ్రిటీలు మాత్రం తమ విలాసవంతమైన భవనాలను కాపాడుకునేందుకు నీటిని దుబారా చేస్తున్నారని మండిపడుతున్నారు. 

కాగా, కాలిపోర్నియాను వణికిస్తున్న పాలిసేడ్స్, ఈటన్ కార్చిచ్చుల కారణంగా ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోగా, 12,300 ఇళ్లు, వ్యాపార సముదాయాలు కాలి బూడిదయ్యాయి. మరో 57 వేల నిర్మాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. పాలిసేడ్స్ కార్చిచ్చు కారణంగా 23,707 ఎకరాల్లో అడవి కనుమరుగైంది. ఈటన్ దావానలం వల్ల 14,117 ఎకరాల్లో అడవి మాయమైంది. ఈ కార్చిచ్చులను అమెరికాలోనే అత్యంత ఘోరమైన ప్రకృతి ఉత్పాతాలుగా అభివర్ణిస్తున్నారు. 

More Telugu News