TTD: తిరుపతి తొక్కిసలాట బాధితులకు పరిహారం అందించిన టీటీడీ

- క్షతగాత్రులకు పరిహారం చెక్కులను అందజేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
- తీవ్రంగా గాయపడిన ఇద్దరికి రూ.5 లక్షల వంతున చెక్కులు పంపిణీ
- మరో ఐదుగురికి రూ.2 లక్షల చొప్పున పరిహారం చెక్కులు అందజేత
వైకుంఠ ఏకాదశి పర్వదిన టోకెన్ల జారీ సమయంలో ఈ నెల 8న రాత్రి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా, మరి కొందరు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబాలకు టీటీడీ పరిహారం ప్రకటించింది. గాయపడిన బాధితులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం నష్టపరిహారం చెక్కులు పంపిణీ చేశారు.
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఏడుగురు బాధితులకు శనివారం స్విమ్స్ డైరెక్టర్ ఛాంబర్ నందు పరిహారం చెక్కులను అందజేశారు. మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్, టీటీడీ జేఈవో వీ వీరబ్రహ్మం, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ వెంకటేశ్వర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ సమక్షంలో పరిహారం చెక్కులను అందజేశారు.
తీవ్రంగా గాయపడిన అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన తిమ్మక్కకు రూ.5 లక్షలు, విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంకు చెందిన పీ ఈశ్వరమ్మకు రూ.5 లక్షల చొప్పున అందజేశారు. గాయపడిన మరో ఐదుగురికి రెండు లక్షల వంతున పరిహారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. మృతి చెందిన ఆరు కుటుంబాలకు పరిహారం చెల్లించేందుకు టీటీడీ పాలకమండలి సభ్యులతో రెండు కమిటీలను ఏర్పాటు చేశామని చెప్పారు. విశాఖ, నర్సీపట్నం ప్రాంతాల్లోని బాధిత కుటుంబాల వద్దకు వెళ్లే బృందంలో బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, జంగా కృష్ణమూర్తి, పనబాక లక్ష్మి, జానకీ దేవి, మహేందర్ రెడ్డి, ఎంఎస్ రాజు, జీ భానుప్రకాశ్ రెడ్డి ఉన్నారని చెప్పారు. అలానే తమిళనాడు, కేరళ సరిహద్దులోని బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసే కమిటీలో రామమూర్తి, కృష్ణమూర్తి, వైద్య నాథన్, నరేశ్ కుమార్, శాంతారామ్, సుచిత్రా ఎల్లా ఉన్నారని తెలిపారు.