N Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై సస్పెన్షన్ వేటు

 AP Govt suspends CID Former Chief Sanjay

  • రూ.1 కోటి మేర దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు
  • విచారణ జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్
  • ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విజిలెన్స్ విభాగం
  • నివేదిక ఆధారంగా సంజయ్ ని సస్పెండ్ చేసిన కూటమి ప్రభుత్వం
  • హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు

గత ప్రభుత్వ హయాంలో సీఐడీని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడుకున్నట్టు ఆరోపణలు రావడం తెలిసిందే. ఐపీఎస్ అధికారి ఎన్.సంజయ్ గత ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్ గా వ్యవహరించారు. ఇప్పుడాయనపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే, అవినీతి చర్యల కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. 

సంజయ్ ఇంతకుముదు ఫైర్ డిపార్ట్ మెంట్ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో రూ.1 కోటి మేర దుర్వినియోగం జరిగిందన్న విషయాన్ని విజిలెన్స్ శాఖ నిర్ధారించింది. పనులు పెద్దగా జరగకుండానే భారీ మొత్తంలో చెల్లింపులు చేసినట్టు గుర్తించింది. సౌత్రిక టెక్నాలజీస్ అండ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో కలిసి సంజయ్... ఈ మేరకు దుర్వినియోగానికి పాల్పడినట్టు వెల్లడైంది. 

దీనిపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా సంజయ్ పై సర్కారు సస్పెన్షన్ వేటు వేసింది. సంజయ్ హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. దళితులకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించే కార్యక్రమాల పేరిట ఆయన దుర్వినియోగానికి పాల్పడ్డట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలోనే ఆయన తాజాగా సస్పెండ్ అయ్యారు.

N Sanjay
Sunspension
CID
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News