Pawan Kalyan: రంగుల కోసం రూ.101 కోట్లు ఖర్చు చేశారు: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan attends council meetings

  • మండలి సమావేశాలకు హాజరైన పవన్
  • సచివాలయాలకు రంగులు వేసేందుకు, తొలగించేందుకు రూ.101 కోట్లు అని వెల్లడి
  • హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించారని వివరణ

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నేడు శాసనమండలి సమావేశాలకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ సచివాలయాలకు రంగుల అంశంపై మండలిలో ఆయన సమాధానమిచ్చారు. 

గతంలో సచివాలయాలకు రంగులు వేసేందుకు, వేసిన రంగులు తొలగించేందుకు రూ.101.81 కోట్లు ఖర్చు చేశారని వెల్లడించారు. రంగులు వేసేందుకు రూ.49.8 కోట్లు... రంగులు తొలగించేందుకు 52.73 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు.

ఇతర కార్యాలయాలకు కూడా రంగులు వేశారని, ఆ ఖర్చును సంబంధిత శాఖలు తెలియజేస్తాయని పవన్ తెలిపారు. హైకోర్టు ఆదేశాలతో పార్టీ రంగులు తొలగించి నిర్దేశిత రంగులు వేయడం జరిగిందని పేర్కొన్నారు. 

కామన్ డంపింగ్ యార్డుల ఏర్పాటుకు చర్యలు

గ్రామాల్లో డంపింగ్ యార్డులపైనా శాసనమండలిలో చర్చ జరిగింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జవాబిచ్చారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణకు నిధులు ఇచ్చామని వెల్లడించారు. 15వ ఆర్థిక సంఘం నిధులను సంపద సృష్టి కేంద్రాలకు కేటాయించామని తెలిపారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చామని వివరించారు. 

గ్రామాలు స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. డంపింగ్ యార్డు కోసం గ్రామాల్లో స్థల సేకరణ కష్టంగా ఉందని, డంపింగ్ యార్డుల సమస్యను కచ్చితంగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 10 నుంచి 12 గ్రామాలకు కలిపి కామన్ గా డంపింగ్ యార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Pawan Kalyan
AP Legislative Council
Janasena
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News