Chandrababu: విద్యుదాఘాతంతో నలుగురి మృతిపై సీఎం చంద్రబాబు విచారం
![Chandrababu on Electric Shock Incident in Undarajavaram](https://imgd.ap7am.com/thumbnail/cr-20241104tn67286212921f0.jpg)
- తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రులో ఘటన
- నలుగురు మృతిచెందడం బాధాకరమన్న చంద్రబాబు
- ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని తాడిపర్రులో ఫ్లెక్సీ కడుతున్న సమయంలో కరెంట్ షాక్తో నలుగురు చనిపోయిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. నలుగురు మృతిచెందడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వారికి ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. తాడిపర్రులో పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణగా గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.