Nara Lokesh: ఏపీలో సర్టిఫికెట్ల క‌ష్టాల‌కు టాటా... వాట్సాప్ లో ఇస్తుంది మెటా

AP Govt tie up with Meta for certficates issuing

  • యువగళంలో సర్టిఫికెట్ల కోసం ప్రజల కష్టాలు తెలుసుకున్న లోకేశ్
  • వాట్సాప్ ద్వారా జారీ చేసే ఏర్పాటు చేస్తానని లోకేశ్ హామీ
  • అధికారంలోకి రాగానే మాట నిలుపుకునే ప్రయత్నం
  • నేడు వాట్సాప్ మాతృసంస్థ మెటాతో కీలక ఒప్పందం

కుల ధృవీకరణ సర్టిఫికెట్ కావాలంటే మూడు గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసులు, న‌లుగురు వ‌ర‌కూ వివిధ హోదాల అధికారులు, సిబ్బంది చుట్టూ ఓ వారం రోజులు తిర‌గాల్సిందే. క‌రెంటు, న‌ల్లా, ఇంటి ప‌న్ను, ఇత‌ర‌త్రా బిల్లులు చెల్లించాలంటే సంబంధిత కార్యాల‌యాల్లో ఇప్ప‌టికీ ఎడ‌తెగ‌ని క్యూలలో నిరీక్ష‌ణ త‌ప్ప‌దు. నాడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఈ స‌ర్టిఫికెట్ల క‌ష్టాల‌ను యువ‌త ఏక‌రువు పెట్టారు. 

వాట్సాప్ లో ఒక టెక్ట్స్ మెసేజ్ చేస్తే ఇంటికి, మ‌నిషికి అవ‌స‌ర‌మైన స‌మ‌స్త వ‌స్తువులు వ‌స్తున్నప్పుడు, సేవ‌లు అందుతున్న‌ప్పుడు.. ఒక స‌ర్టిఫికెట్ కోసం ఆఫీసులు చుట్టూ ప‌నులు మానుకుని మ‌రీ తిర‌గాల్సిన ప‌రిస్థితికి చెక్ పెడ‌తామ‌ని, ప్ర‌భుత్వంలోకి రాగానే... వాట్సాప్ ద్వారా ప‌ర్మినెంట్ స‌ర్టిఫికెట్ పొందే అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. 

 అధికారంలోకి రాగానే కూట‌మి ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్క‌టి నెర‌వేరుస్తోంది. విద్య‌, ఐటీ, ఎల‌క్ట్రానిక్స్ శాఖ‌ల మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న నారా లోకేశ్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీల‌న్నీ ప్రాధాన్య‌తాక్ర‌మంలో అమ‌లు చేస్తున్నారు. ప్ర‌తి ఏటా క్యాస్ట్ స‌ర్టిఫికెట్ల కోసం కార్యాల‌యాల చుట్టూ తిరిగే అవ‌స‌రం లేకుండా వాట్సాప్ ద్వారా పొందే ప‌ద్ధ‌తి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 

అలాగే వివిధ ర‌కాల బిల్లులు వాట్సాప్ ద్వారా చెల్లించేయ‌వ‌చ్చు. ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్ స్టా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా ప్ర‌పంచ‌మంతా విస్త‌రించిన మెటాతో ఏపీ ప్రభుత్వం కీల‌క ఒప్పందం కుదుర్చుకోనుంది. ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, ఆర్టీజీ, విద్య శాఖ‌ల మంత్రి నారా లోకేశ్ చొర‌వ‌తో ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం నుంచి పౌర‌సేవ‌లు వాట్సాప్ బిజినెస్ ద్వారా అందించేందుకు మెటా అంగీక‌రించింది. 

మెటా ఫ్లాట్ ఫాం వాట్సాప్ బిజినెస్ ద్వారా ఇక‌పై క్యాస్ట్, ఇత‌ర‌త్రా స‌ర్టిఫికెట్లు వేగంగా, సుల‌భంగా పొందేందుకు వీలవుతుంది. అలాగే న‌కిలీలు, ట్యాంప‌రింగ్ అవ‌కాశం లేకుండా పార‌ద‌ర్శ‌కంగా ఆన్‌లైన్‌లోనే స‌ర్టిఫికెట్ల జారీ ఉంటుంది. 

మెటా నుంచి క‌న్స‌ల్టేష‌న్ టెక్నిక‌ల్ స‌పోర్ట్, ఈ గ‌వ‌ర్నెన్స్ అమ‌లు, ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ ద్వారా మ‌రిన్ని పౌర సేవలు ఏపీ ప్ర‌భుత్వానికి అందించేలా మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో ఏపీ అధికారులు, మెటా ప్ర‌తినిధులు ఢిల్లీ లోని 1 జన్ పథ్ లో జరిగిన కార్యక్రమంలో ఎంవోయూ (ఒప్పందం) చేసుకున్నారు. 

యువ‌గ‌ళం హామీలు నెర‌వేర్చ‌డంలో మెటాతో ఎంవోయూ ఒక మైలురాయి: మంత్రి నారా లోకేశ్ 

మెటాతో ఎంవోయూ ఒక చారిత్రాత్మ‌క‌మైన మైలురాయి అని మంత్రి లోకేశ్ అభివ‌ర్ణించారు. "యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ స‌ర్టిఫికెట్ల కోసం ప‌డుతున్న క‌ష్టాలు ప్ర‌త్య‌క్షంగా చూసి... మొబైల్‌లోనే ఆయా స‌ర్టిఫికెట్లు అందిస్తాం అని హామీ ఇచ్చాను. మాట ఇచ్చిన‌ట్టే వాట్సాప్ లోనే స‌ర్టిఫికెట్లు, పౌర‌సేవ‌లు పొందేలా నేడు మెటాతో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మ‌రిన్ని సేవ‌లు ఆన్‌లైన్‌లో అతి సులువుగా, పార‌ద‌ర్శ‌కంగా, అతి వేగంగా పొందే ఏర్పాట్లు చేస్తాం" అని లోకేశ్ భ‌రోసా ఇచ్చారు. 

ఏపీ ప్ర‌భుత్వంతో ఒప్పందం చాలా సంతోషం: మెటా ఇండియా 

మెటాలో ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్ సేవ‌లను వాడుకుని వాట్సాప్ ద్వారా ఏపీ ప్ర‌జ‌ల‌కు పౌర సేవలను అందించేందుకు ఏపీ ప్ర‌భుత్వంతో ఒప్పందం చేసుకోవ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని మెటా ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంధ్యా దేవనాథన్ ప్ర‌క‌టించారు. 

అంద‌రూ త‌మ‌కు కావాల్సిన సేవ‌లు పొందేందుకు వీలుగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటిలిజెన్స్‌, వాట్సాప్ అప్లికేష‌న్ ప్రోగ్రామింగ్ ఇంట‌ర్ ఫేస్ ఉంటుంద‌ని, మా డిజిట‌ల్ టెక్నాల‌జీని వాడుకుని ఏపీ ప్ర‌భుత్వం ద్వారా ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని ఉత్త‌మసేవ‌లు అందించ‌గ‌ల‌మ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.  

  • Loading...

More Telugu News