Barbaric Act: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మాజీ ప్రియుడు... ఘటనపై ఆరా తీసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu enquires yourh set afire girl in YSR district

  • వైఎస్సార్ జిల్లాలో ఘటన
  • మాట్లాడాలి రమ్మంటూ పిలిచి దారుణానికి పాల్పడిన యువకుడు
  • 80 శాతం కాలిన గాయాలతో చావుబతుకుల్లో అమ్మాయి
  • నిందితుడ్ని వెంటనే అరెస్ట్ చేయాలన్న సీఎం చంద్రబాబు

వైఎస్సార్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థినిపై మాజీ బాయ్ ఫ్రెండ్ పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడా విద్యార్థిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్డాడుతోంది. నిందితుడు విఘ్నేశ్ కోసం పోలీసులు తీవ్రస్థాయిలో గాలిస్తున్నారు. 

ఈ ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. వెంటనే నిందితుడ్ని పట్టుకోవాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికారులతో ఫోన్ లో మాట్లాడిన చంద్రబాబు... బాధితురాలి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆ అమ్మాయికి అందుబాటులో ఉన్న అత్యుత్తమ వైద్య చికిత్స అందించేలా చూడాలని స్పష్టం చేశారు.

ఇక, ఘటన పూర్వాపరాల్లోకి వెళితే... ఆ అమ్మాయి, విఘ్నేశ్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇటీవల ఆ యువకుడు మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ ఇంటర్ విద్యార్థినితో సంబంధం కొనసాగించాలని భావించాడు. నీతో మాట్లాడాలి అంటూ ఆ అమ్మాయిని కోరాడు. ఆ అమ్మాయి రాకపోతే చనిపోతానని బెదిరించాడు. దాంతో ఆ అమ్మాయి కాలేజీ నుంచి ఆటో ఎక్కి అతడు చెప్పిన చోటకు వచ్చింది. 

ఇద్దరూ కలిసి బద్వేలుకు 10 కిలోమీటర్ల దూరంలోని సెంచురీ ప్లైవుడ్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చారు. అక్కడ ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ... విఘ్నేశ్ ఆ అమ్మాయి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అక్కడికి సమీపంలోని పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు ఆ విద్యార్థిని అరుపులు విని అక్కడికి వచ్చి మంటలు ఆర్పారు. 

రైతుల రాకను గమనించి యువకుడు అక్కడ్నించి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు వచ్చి ఆ విద్యార్థినిని బద్వేలులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం కడపలోని రిమ్స్ కు తరలించారు. ఆ అమ్మాయి 80 శాతం కాలిన గాయాలతో బాధపడుతుండడంతో, ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. జిల్లా జడ్జి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. 

ఈ ఘటనపై వైఎస్సార్ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ స్పందిస్తూ... నిందితుడి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయని వెల్లడించారు. యువకుడు, విద్యార్థిని బద్వేలు పట్టణానికి సమీపంలోని ఒకే ప్రాంతానికి చెందినవారని తెలిపారు.

  • Loading...

More Telugu News