School Girl: ఉత్తరాఖండ్ విద్యార్థినిపై ఢిల్లీ హోటల్‌లో సామూహిక లైంగికదాడి

Uttarakhand School Girl Gang Raped In Delhi Hotel

  • ఈ నెల 4న హల్ద్వానీలో రైలెక్కి ఢిల్లీ చేరుకున్న బాలిక
  • రైలులో ఆమెకు పరిచమైన నిందితులు
  • 5, 6 తేదీల్లో హోటల్‌లో బాధితురాలిపై లైంగికదాడి
  • నిందితులందరూ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన మరో దారుణం వెలుగుచూసింది. 15 ఏళ్ల బాలికపై ఓ హోటల్ గదిలో ఐదుగురు వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందినవారు. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ నెల 4న ఆమె ఒంటరిగా రైలెక్కి ఢిల్లీ చేరుకుంది. రైలులో ఆమెకు పరిచయమైన నిందితులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

5, 6 తేదీల్లో ఢిల్లీ విమానాశ్రయంలో సమీపంలోని హోటల్‌లో ఆమెపై లైంగికదాడి జరిగింది. తన కుమార్తె కనిపించడం లేదని బాధిత బాలిక తండ్రి హల్ద్వానీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజీలు, బాధితురాలి ఫోన్ లోకేషన్ ఆధారంగా బాలిక ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఉన్నట్టు గుర్తించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు ఆమెను తిరిగి ఈ వారం హల్ద్వానీ చేర్చారు. వైద్య పరీక్షల్లో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తేలింది. మహారాష్ట్ర, ఢిల్లీకి చెందిన నిందితులు ఐదుగురూ రైలులో ఆమెకు పరిచయమైనట్టు పోలీసులు తెలిపారు. బీఎన్ఎస్ సెక్షన్ 70 (సామూహిక లైంగికదాడి), పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.  

  • Loading...

More Telugu News