Balakrishna: అల్లు అరవింద్ కాకుండా ఇంకెవరైనా అడిగి ఉంటే నో చెప్పేవాడ్ని: బాలకృష్ణ

Balakrishna said he is doing Unstoppable Talk Show only after Allu Aravind insisted

  • మూడు సీజన్ల పాటు విజయవంతమైన అన్ స్టాపబుల్ టాక్ షో
  • త్వరలో నాలుగో సీజన్
  • దసరా వేళ ట్రైలర్ రిలీజ్
  • హైదరాబాదులో గ్రాండ్ గా ఫంక్షన్

ఓటీటీ రంగంలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో ఓ సంచలనం. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా, ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే ఈ టాక్ షో రేటింగ్ మామూలుగా ఉండదు. 

టాక్ షోకి హాజరయ్యేవారిని బాలయ్య తనదైన శైలిలో ప్రశ్నిస్తూ, వారి నుంచి ఆసక్తికర సమాధానాలు రాబడుతూ, నవ్విస్తూ, కవ్విస్తూ ఆడియన్స్ ను గిలిగింతలు పెడుతూ, తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించడం ఈ ఈ కార్యక్రమానికి ప్లస్ అయింది. 

ఇప్పటికే మూడు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే తాజాగా నాలుగో సీజన్ లోకి ఎంటరవుతోంది. ఈ నేపథ్యంలో, ఈ టాక్ షో టీమ్ హైదరాబాదులో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని తదితరులు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ మాట్లాడుతూ... అల్లు అరవింద్ వల్లే తాను ఈ టాక్ షో చేస్తున్నానని వెల్లడించారు. వాస్తవానికి అల్లు అరవింద్ కాకుండా ఇంకెవరైనా అడిగి ఉంటే తాను ఈ షో చేసేవాడ్ని కాదని అన్నారు. ఇతర ప్రోగ్రామ్ లు చేయాలని చాలామంది అడిగారని, వారందరికీ నో చెప్పానని తెలిపారు. 

అన్ స్టాపబుల్ షో సమయంలో తామందరం ఒక కుటుంబంలా కలిసిపోయామని బాలయ్య పేర్కొన్నారు. సమష్టి కృషి ఫలితమే ఈ టాక్ షో విజయవంతం కావడానికి కారణం అని వివరించారు. 

ఇక, అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానని వెల్లడించారు. ఇవాళ ఎంతో ప్రశస్తమైన రోజు అని వివరించారు. దసరా నవరాత్రుల సందర్భంగా శక్తి స్వరూపిణి అయిన అమ్మ వారిని 9 అవతారాల్లో పూజించుకుంటామని తెలిపారు. 

చెడు మీద మంచి, అన్యాయం మీద న్యాయం, అధర్మం మీద ధర్మం... ఇలా విజయానికి సూచిక విజయదశమి అని బాలకృష్ణ అభివర్ణించారు. ఏదైనా గట్టిగా ప్రయత్నిస్తే విజయం దక్కుతుందని, అందుకు దసరా శరన్నవరాత్రులే నిదర్శనం అని అన్నారు.

  • Loading...

More Telugu News