TTD: కనుల పండువగా శ్రీవారి మహా రథోత్సవం

srivari maha rathotsavam in tirumala

  • తిరుమలలో వైభవంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
  • శుక్రవారం రాత్రి అశ్వ వాహన సేవతో ముగియనున్న వాహన సేవలు
  • రేపు చక్రస్నానంతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహా రథోత్సవాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వేడుకలో పాల్గొని జయజయధ్వానాలు చేశారు. మహారథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు తిరుమాడ వీధుల్లో ఊరేగారు. గోవింద నామస్మరణతో భక్తులు రథాన్ని లాగారు. ఈ రోజు (శుక్రవారం) రాత్రి శ్రీవారు అశ్వ వాహనంపై కల్కి అలంకారంలో భక్తులకు అభయమివ్వనున్నారు. దీంతో శ్రీవారి వాహన సేవలు ముగియనున్నాయి. 

శనివారం (రేపు) చివరి ఘట్టమైన చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలరావు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులు ప్రశాంతంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లు చేశారు. పుష్కరిణిలో ఇబ్బంది లేకుండా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా, 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 60,775 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 25, 288 మంది తలనీనాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ కానుకల ద్వారా గురువారం రూ.3.88 కోట్ల ఆదాయం వచ్చింది.

  • Loading...

More Telugu News