Sabitha Indra Reddy: రేవంత్ రెడ్డిపై సబితా ఇంద్రారెడ్డి తీవ్ర ఆగ్రహం

Sabitha Indra Reddy fires at CM Revanth Reddy

  • కేసీఆర్‌ను ఎక్కడ పడితే అక్కడ విమర్శించడమే మీ పనా? అని నిలదీత
  • ఒక్క సభలో అయినా కేసీఆర్‌‌ను విమర్శించకుండా మాట్లాడారా? అని ప్రశ్న
  • అవన్నీ చెబితే బాగుండేది రేవంత్ రెడ్డి గారూ అంటూ ఎద్దేవా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఎక్కడ పడితే అక్కడ విమర్శించడమే మీ పనా? అని ప్రశ్నించారు. గత పది నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క సభలో అయినా కేసీఆర్‌ను విమర్శించకుండా మాట్లాడారా? అని నిలదీశారు. నిన్న ఉద్యోగ నియామక పత్రాలు అందించిన సమయంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు సరికాదన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.

విద్యార్థుల ముందు, గురువుల ముందు కేసీఆర్‌ను విమర్శించడమే మీ విధానమా ముఖ్యమంత్రి గారూ? అని ఎద్దేవా చేశారు. మాట్లాడేటప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమమా? లేక పార్టీ కార్యక్రమమా? అనే విషయం మరిచిపోతున్నట్లుగా ఉన్నారని చురక అంటించారు. మీరు ఇచ్చామని చెబుతున్న టీచర్ పోస్టులు కేసీఆర్ మంజూరు చేసినవి కావా? హయ్యర్ ఎడ్యుకేషన్‌‌లో 3,202 పోస్టులు, యూనివర్సిటీలో 1,081 పోస్టులు కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినవి కావా? అని ప్రశ్నించారు.

ఇంటర్, టెక్నికల్, కళాశాల విద్యకు సంబంధించి 3,896 కాంట్రాక్టు ఉద్యోగులను కేసీఆర్ రెగ్యులరైజ్ చేశారని చెబితే బాగుండేదన్నారు. ఎన్నికల ముందు మీరు చెప్పిన 25,000 టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదో అదే గురువుల ముందు చెబితే బాగుండేదన్నారు. ఎన్నికలప్పుడు 6,000 పాఠశాలలు మూతపడ్డాయని అబద్ధం చెప్పిన మీరు, ఆ పాఠశాలల లిస్ట్ విడుదల చేస్తే బాగుండేదని వ్యాఖ్యానించారు.

'మన ఊరు మన బడి' కార్యక్రమం ఎందుకు ఆపేసారో చెబితే బాగుండేదన్నారు. 6 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్న... కేసీఆర్ ప్రవేశపెట్టిన గురుకులాలను తమ ప్రభుత్వం నిర్వీర్యం చేద్దామనుకుంటుందని చెబితే బాగుండేదని ఎద్దేవా చేశారు. బ్రేక్ ఫాస్ట్ స్కీంను ఎందుకు ఆపేశారు? ఎన్నికల సమయంలో చెప్పినట్లు ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారు? 19 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న మీరు మిగతా పాఠశాలలను ఎందుకు గాలికి వదిలేశారు? ఇవన్నీ చెబితే బాగుండేదన్నారు.

  • Loading...

More Telugu News