Skill Census: మంగళగిరి నియోజకవర్గం నుంచి స్కిల్ సెన్సస్ కు శ్రీకారం

Skill Census has began from Mangalagiri constituency as a pilot project

  • ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సస్ కార్యక్రమం
  • ఎన్నికల్లో ఇచ్చిన హామీ కార్యరూపం దాల్చుతున్న వైనం
  • మంగళగిరి నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలంలో పైలట్ ప్రాజెక్టు
  • 1,61,421 కుటుంబాల నుంచి వివరాల సేకరణ

దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న స్కిల్ సెన్సస్ ప్రాజెక్టుకు మంత్రి నారా లోకేశ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నుంచి శ్రీకారం చుట్టారు. పైలట్ ప్రాజెక్టుగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు తుళ్లూరు మండలంలో స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. 

స్కిల్ సెన్సస్ కోసం 100 గ్రామ సచివాలయాల పరిధిలో సెన్సస్ సేకరణకు సంబంధించిన లాగిన్ ఇచ్చారు. 675 మంది ఎన్యుమరేటర్లు  మంగళగిరి నియోజకవర్గంలో 1,35,914 గృహాలు, తుళ్లూరు మండలంలో 25,507 గృహాలు కలిపి మొత్తం 1,61,421 కుటుంబాల నుంచి స్కిల్ సెన్సస్ చేపట్టనున్నారు. ఇందుకు అవసరమైన మొబైల్ యాప్ సిద్ధం చేశారు. ఎన్యుమరేటర్ల శిక్షణ కూడా పూర్తయింది. ఫీల్డ్ టీమ్స్ కు సహాయం చేసేందుకు టెక్నికల్ టీమ్ లను కూడా ఏర్పాటుచేశారు. 

ఇప్పటికే ఎన్యుమరేటర్లు, కుటుంబాలకు సంబంధించిన మ్యాపింగ్ పూర్తయింది. గ్రామ సచివాలయాలు, స్కిల్ డెవల్ మెంట్ శాఖ, సీడాప్, న్యాక్ విభాగాల సిబ్బంది స్కిల్ సెన్సస్ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. 

ఈ కార్యక్రమాన్ని స్కిల్ డెవలప్ మెంట్ హెడ్ క్వార్టర్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తారు. పైలట్ ప్రాజెక్టులో ఏమైనా లోపాలు గమనిస్తే సరిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ప్రక్రియను ప్రారంభిస్తారు. 

యువతలో నైపుణ్యాలను గుర్తించి, అవసరమైన నైపుణ్యాభివృద్ధి అందించడం ద్వారా మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పించడం  స్కిల్ సెన్సస్ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.

  • Loading...

More Telugu News