Nara Lokesh: అంద‌రం క‌లిసిక‌ట్టుగా ప‌నిచేసి స‌ర్కారు స్కూళ్ల‌ను బ‌లోపేతం చేద్దాం.. విద్యాశాఖ అధికారుల‌తో మంత్రి లోకేశ్‌

Minister Nara Lokesh Reveiw Meeting on Schoool Eductaion

  • పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేశ్‌ సమీక్ష
  • ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాల‌ని సూచ‌న‌
  • శ్రీకాకుళంలో మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల పనితీరు బాగుందని ప్ర‌శంస‌
  • అక్టోబర్ 3 నుంచి దసరా సెలవులు
  • ఇంటర్మీడియట్ విద్యను ప్రక్షాళన చేస్తామ‌న్న మంత్రి
  • ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎన్సీఈఆర్టీ బుక్స్

ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టిసారించాలని పాఠశాల విద్య ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి లోకేశ్‌ ఉండవల్లి నివాసంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. తొలుత పాఠశాలలను లీక్ ప్రూఫ్‌గా మార్చాల‌ని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో బెంచిలు ఏర్పాటు చేయ‌డంతో పాటు మంచినీరు, టాయ్ లెట్స్ వంటి సౌక‌ర్యాలు పూర్తిస్థాయిలో ఉండాల‌న్నారు. అలాగే కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటుతో పాటు అవసరాన్ని బట్టి అదనపు తరగతి గదులపై దృష్టిసారించాలని సూచించారు. 

ఇటీవల తాను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, అకనంబట్టు హైస్కూళ్ల పనితీరు బాగుందని తెలిపారు. స్కూలులో విద్యార్థుల హ్యాండ్ రైటింగ్, పర్ఫార్మెన్స్ బాగున్నాయన్నారు. 

శ్రీకాకుళం స్కూలులో కేవలం రూ.50 వేలతో అక్కడి టీచర్లు తరగతి గదులను బాగుచేసుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నాడు-నేడు, కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా పెద్దఎత్తున డబ్బు ఖర్చు చేసినా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు ఎందుకు తగ్గిపోయార‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి ప్ర‌శ్నించారు. లోపం ఎక్కుడుందో తెలుసుకొని సరిదిద్దాలని అధికారులకు సూచించారు. 

ప్రభుత్వ స్కూళ్ల బలోపేతం, మెరుగైన ఫలితాల కోసం నవంబర్ 14న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్ –టీచర్స్ సమావేశాలు నిర్వహించి ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని తెలిపారు. ఇందులో ముఖ్యమంత్రి నుంచి వార్డు మెంబర్ వరకు అందరం భాగస్వాములం అవుతామని అన్నారు. 

స్కూళ్లలో ఫలితాల మెరుగుదలపై ప్రతి క్వార్టర్‌కు సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు గ్రంథాలయాల బలోపేతంపై చర్చించారు. కొద్దిపాటి నిధులు వెచ్చిస్తే నిరుద్యోగ యువతకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు. త్వరలో అమరావతిలో అత్యాధునిక సదుపాయాలతో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామ‌న్నారు. 

అలాగే రాష్ట్రవ్యాప్తంగా లెర్నింగ్ ఎక్సెలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్‌పై కేపీఎంజీ ప్రతినిధులు నారాయణన్, సౌమ్య పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాఠశాల విద్య రోడ్ మ్యాప్, 117 జీవో, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, టెట్, మెగా డీఎస్సీ నిర్వహణపై సమావేశంలో చర్చించడం జరిగింది. 

వరదల కారణంగా ఉపాధ్యాయ దినోత్సవం జరపలేకపోయామని, నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డేను ఘనంగా నిర్వహించాల‌ని మంత్రి సూచించారు. ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులు, సంఘాల కోరిక మేరకు దసరా సెలవులు అక్టోబర్ 3 నుండే ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, కమిషనర్ విజయరామరాజు, సమగ్రశిక్షస్టేట్ ప్రాజెక్ట్ డైరక్టర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేశ్‌
ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రతి ఏడాది ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో ఇంటర్‌ విద్యలో చేపట్టాల్సిన సంస్కరణలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. 

వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు ఇంటర్ కళాశాలలు అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వ ఇంటర్ కళాశాలల పనితీరును ఈ సందర్భంగా మంత్రికి అధికారులు వివరించారు. పనిదినాలు, అకాడమిక్ కేలండర్, సిలబస్, అధ్యాపకుల పని విభజన, పరీక్షల షెడ్యూల్, పేరెంట్-టీచర్ మీటింగ్, అధ్యాపకులకు శిక్షణ, విద్యార్థుల హాజ‌రు, విద్యార్థుల సామర్థ్యం పెంపు వంటి అంశాలపై సుదీర్ఘ చర్చ‌ జరిగింది. 

జేఈఈ, నీట్, ఈఏపీ సెట్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ కోసం విద్యార్థులకు సామర్థ్య పరీక్షలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఇంటర్మీడియట్ విద్యపై కనీస సమీక్ష లేదని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల్లో మార్పులు తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ స‌మీక్ష సమవేశంలో ఇంటర్మీడియట్ విద్య డైరెక్టర్ కృతికా శుక్లాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News