America Temple: అమెరికాలో ఆలయ గోడలపై విద్వేష రాతలు

Temple defaced in US with Hindus go back message

  • హిందువులు తిరిగి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు
  • మోదీ హిట్లర్, టెర్రరిస్ట్ అంటూ గోడలపై రాసిన దుండగులు
  • ఆందోళనల్లో ఇండియన్ అమెరికన్లు.. దర్యాఫ్తు జరుపుతున్న పోలీసులు
  • గడిచిన పది రోజుల్లో ఇది రెండో ఘటన

అమెరికాలోని ఆలయ గోడలపై హిందూ విద్వేష రాతలు దర్శనమిచ్చాయి.. కాలిఫోర్నియాలోని స్వామినారాయణ్ మందిర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఆలయ గోడలను పాక్షికంగా ధ్వంసం చేసిన దుండగులు.. హిందువులంతా వెనక్కి వెళ్లిపోవాలంటూ గోడపై పెయింట్ తో రాశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ లు టెర్రరిస్టులని, మోదీ హిట్లర్ అని గోడలపై రాశారు. ఈ ఘటనతో శాక్రిమెంటోలోని హిందువులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. హిందూ విద్వేష రాతలపై ఆలయ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాక్రిమెంటో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశోధన చేపట్టారు. ఆలయ సిబ్బంది ఫిర్యాదుతో కేసు దర్యాఫ్తు ప్రారంభించారు.

గడిచిన పది రోజులలో ఈ తరహా ఘటన చోటుచేసుకోవడం ఇది రెండవ సారి కావడం గమనార్హం. ఇటీవల న్యూయార్క్ లోని స్వామినారాయణ్ మందిర్ వద్ద కూడా దుండగులు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. కాగా, ఈ విద్వేష రాతలకు సంబంధించిన ఫొటోలను స్వామి నారాయణ్ మందిర్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. మహంత్ స్వామి మహారాజ్ బోధనలు గుర్తుచేసుకుంటూ విద్వేషాన్ని తరిమికొట్టేందుకు, ఐకమత్యాన్ని చాటిచెప్పేందుకు మరింత నిబద్ధతతో ప్రచారం సాగిస్తామని తెలిపింది.

ఈ ఘటనను మందిర్ కమ్యూనిటీ మొత్తం తీవ్రంగా ఖండించినట్లు పేర్కొంది. మరోవైపు, ఈ ఘటనపై భారత సంతతికి చెందిన చట్ట సభ్యుడు అమి బెరా స్పందించారు. విద్వేష రాతలను ఆయన ఖండించారు. శాక్రిమెంటో కౌంటీలో జాతి, మతం సహా ఎలాంటి విద్వేషాలకు తావులేదని తేల్చిచెప్పారు. మతం ఏదైనా మన కమ్యూనిటీలో అభద్రతాభావానికి చోటులేదని, అందరూ గౌరవంగా, సెక్యూర్డ్ గా ఉండేలా మనమంతా ప్రవర్తించాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News