PM Modi: మీరు భారతదేశపు బ్రాండ్ అంబాసిడర్లు.. అమెరికాలోని ప్ర‌వాస భార‌తీయుల‌తో ప్ర‌ధాని మోదీ!

You Are India Brand Ambassadors says PM Modi Indians Settled In US

  • లాంగ్ ఐలాండ్‌లో భార‌తీయ ప్ర‌వాసుల‌తో ప్ర‌ధాని మోదీ స‌మావేశం
  • నాసావు కొలీజియంలో 'మోదీ అండ్ యూఎస్‌' కమ్యూనిటీ కార్యక్రమం
  • 10వేల మంది భారతీయ-అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ
  • 'మోదీ, మోదీ' నామస్మ‌ర‌ణ‌తో హోరెత్తిన‌ స్టేడియం 
  • ఇరు దేశాల‌ బంధాన్ని బలోపేతం చేయ‌డంలో భార‌తీయ ప్ర‌వాసులదే కీరోల్ అన్న ప్ర‌ధాని

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మూడు రోజుల ప‌ర్య‌ట‌న నిమిత్తం అమెరికా వెళ్లిన విష‌యం తెలిసిందే. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆదివారం ఆయ‌న లాంగ్ ఐలాండ్‌లో భార‌తీయ ప్ర‌వాసుల‌తో స‌మావేశమ‌య్యారు. లాంగ్ ఐలాండ్‌లోని నాసావు కొలీజియంలో జరిగిన 'మోదీ అండ్ యూఎస్‌' గ్రాండ్ కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రధాని మోదీ పదివేల మంది భారతీయ-అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించారు. అంత‌కుముందు స్టేడియంలో ప్రధాని రాక కోసం ఎదురుచూసిన ప్ర‌వాసులను వరుస సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.

ఇక ప్రధాని ప్ర‌సంగించేందుకు వేదికపైకి వెళుతుండగా 'మోదీ, మోదీ' నామస్మ‌ర‌ణ‌తో స్టేడియం హోరెత్త‌డం గ‌మ‌నార్హం. 'భారత్ మాతా కీ జై!' నినాదంతో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 'నమస్తే' కూడా లోకల్‌ నుంచి గ్లోబల్‌గా మారిందని, విదేశాల్లో స్థిరపడిన భారతీయులకే ఈ ఘనత ద‌క్కుతుంద‌ని మోదీ అన్నారు.

ఈ సంద‌ర్భంగా మోదీ అమెరికాలో తన మునుపటి కమ్యూనిటీ ఈవెంట్‌లను గుర్తు చేసుకున్నారు. 2014 మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో, 2016 కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో, 2018లో హ్యూస్టన్, టెక్సాస్‌లో, 2023 వాషింగ్టన్‌లో, ఇప్పుడు లాంగ్ ఐలాండ్‌లో అంటూ మోదీ చెప్పుకొచ్చారు.

ఇరు దేశాల మధ్య వారధిగా ఉంటూ భారత్-అమెరికా బంధాన్ని బలోపేతం చేయ‌డంలో భార‌తీయ ప్ర‌వాసులు ఎంతో దోహదపడ్డార‌ని ఆయన అన్నారు. "మీరందరూ ఏడు సముద్రాలు దాటి వచ్చారు. కానీ మీ హృదయాలు, ఆత్మల నుండి భారతదేశంపై ఉన్న‌ ప్రేమను ఏదీ తీసివేయలేదు" అని ప్ర‌ధాని మోదీ చెప్పారు.

భారతదేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు విదేశాల్లో స్థిరపడి ఉండవచ్చు. ఇక్కడ ఉన్న‌వారు అమెరిక‌న్‌ పౌరులుగా మారొచ్చు. అయితే మనందరినీ ఒకచోట చేర్చే సెంటిమెంట్ ఏమిటంటే, 'భారత్ మాతా కీ జై!'... ఇది ఎప్ప‌టికీ మార‌దు. మ‌నం ఎక్క‌డ ఉన్నా మ‌న‌ల్ని ఇది క‌లుపుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని ప్ర‌ధాని తెలిపారు.  

"ఈ సెంటిమెంట్ మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఇదే మ‌న‌ అతిపెద్ద బలం. ఈ సెంటిమెంట్ శాంతియుతంగా, చట్టాన్ని గౌరవించే ప్రపంచ పౌరులుగా ఉండటానికి మ‌న‌కు సహాయపడుతుంది. భారతదేశం ప్రపంచ 'విశ్వ-బంధు' అని ప్రపంచాన్ని గ్రహించేలా చేస్తుంది" అని ప్ర‌ధాని మోదీ అన్నారు. 

ఇక అమెరికాలో స్థిరపడిన భారతీయులను 'రాష్ట్రదూత్' (రాయబారులు) అని పిలిచారు ప్రధాని. ఆ దేశంలో భారతదేశం సంపాదించిన గౌరవానికి, అక్క‌డి భారతీయ సమాజానికి ఈ సంద‌ర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మన భారతీయ విలువలు, సంస్కృతి మనల్ని ఒకటిగా మార్చాయని మోదీ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News