Al Jazeera: గన్నులతో వచ్చి కెమెరాలు తీసుకుని వెళ్లిపొమ్మన్నారు.. ఆల్ జజీరా ఆఫీసులో ఇజ్రాయెల్ సోల్జర్ల దాడి

Israel Raids Al Jazeeras West Bank Office

  • గతంలోనే ఆల్ జజీరాపై బ్యాన్ విధించిన ఇజ్రాయెల్
  • తాజాగా వెస్ట్ బ్యాంక్ లోని ఆఫీసులోకి చొచ్చుకెళ్లిన సోల్జర్లు
  • వెంటనే ఆఫీసు ఖాళీ చేయాలని జర్నలిస్టులకు ఆదేశం

గాజాలో హమాస్ తో, లెబనాన్ లో హిజ్బుల్లా ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా వెస్ట్ బ్యాంక్ లో ఓ మీడియా సంస్థపై దాడి చేసింది. భారీగా ఆయుధాలు ధరించిన ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) సైనికులు ఆల్ జజీరా ఆఫీసులోకి చొచ్చుకెళ్లారు. అక్కడున్న జర్నలిస్టులను కెమెరాలు తీసుకుని ఉన్నఫళంగా ఆఫీసును ఖాళీ చేయాలని ఆదేశించారు. ఇదంతా ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్నప్పటికీ వారు వెనకాడలేదు. ముఖానికి మాస్క్ తగిలించుకున్న సైనికులు ఆయుధాలతో తమను బెదిరించి ఖాళీ చేయించారని ఆల్ జజీరా సిబ్బంది వాపోయారు.

ఈ సందర్భంగా ఓ సైనికుడు చెప్పిన మాటలను ఆల్ జజీరా జర్నలిస్టులు లైవ్ లో వెల్లడించారు. 45 రోజుల్లోగా ఆల్ జజీరా ఆఫీసును క్లోజ్ చేయాలంటూ కోర్టు ఆదేశించిందని గుర్తుచేస్తూ.. ఇక్కడున్న వారంతా కెమెరాలన్నీ తీసుకుని బయటకు వెళ్లిపోవాలని సదరు సైనికుడు అరబిక్ లో చెప్పాడన్నారు. కాగా, జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించిందంటూ తమ దేశంలో ఆల్ జజీరా మీడియా సంస్థను ఇజ్రాయెల్ గతంలోనే బ్యాన్ చేసింది. గత మే నెలలో జెరూసలెంలోని ఓ హోటల్ లో నిర్వహిస్తున్న ఆల్ జజీరా ఆఫీసుపైనా ఇజ్రాయెల్ అధికారులు దాడి చేశారు. ఇటీవల గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులలో ఆల్ జజీరా జర్నలిస్టు ఇస్మాయిల్ అల్ గౌహల్ మరణించారు. 

అయితే, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ గాజా సరిహద్దుల్లో హమాస్ ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో ఇస్మాయిల్ కూడా పాలుపంచుకున్నాడని ఇజ్రాయెల్ మిలటరీ ఆరోపిస్తోంది. హమాస్ ఆదేశాలతో ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన నుఖుబా యూనిట్ అక్టోబర్ 7 దాడికి పాల్పడిందని, ఇస్మాయిల్ కూడా ఈ యూనిట్ సభ్యుడేనని వాదిస్తోంది. ఇదిలా ఉండగా.. వెస్ట్ బ్యాంక్ లో ఆదివారం ఇజ్రాయెల్ సైనికులు తమ ఆఫీసులోకి చొచ్చుకెళ్లి తమ సిబ్బందిని బలవంతంగా ఖాళీ చేయించడంపై ఆల్ జజీరా యాజమాన్యం మండిపడింది. మీడియాను ఇజ్రాయెల్ ఉక్కుపాదంతో అణచివేస్తోందని ఆరోపించింది.

  • Loading...

More Telugu News