Venkaiah Naidu: తిరుమల శ్రీవారి ప్రసాదం వివాదంపై స్పందించిన వెంకయ్యనాయుడు

Venkaiah Naidu responded on Tirumala Laddu

  • ఈ అంశానికి సంబంధించి చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడి
  • శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ప్రతి భక్తుడూ పవిత్రంగా భావిస్తారన్న వెంకయ్య
  • నిజానిజాలు నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎంకు విజ్ఞప్తి

తిరుమల శ్రీవారి ప్రసాదం విషయమై వస్తున్న వార్తలు తనను ఎంతగానో కలిచివేశాయని, దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు.

తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు అని, ఆ స్వామి వారి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా స్వీకరిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా, వారి ఆత్మీయులకు కూడా శ్రీవారి ఆశీస్సులు ఈ ప్రసాదం ద్వారా లభించాలని, ఈ లడ్డూ ప్రసాదాన్ని పంచడం పెద్దల నుంచి ఆచారంగా వస్తోందన్నారు.

ఇంతటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం కలిగిన తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత చాలా కీలకమని పేర్కొన్నారు. అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైనా క్షమార్హం కాదని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో నిజా నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రికి సూచించినట్లు వెల్లడించారు. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ఏపీ ముఖ్యమంత్రిని కోరానని, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వెంకయ్యనాయుడు తెలిపారు.

  • Loading...

More Telugu News