Narendra Modi: కాంగ్రెస్ తెలంగాణ రైతులను మోసం చేసింది: మహారాష్ట్రలో ప్రధాని మోదీ

PM Modi lashes out at Congress party

  • తెలంగాణలో రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారని వ్యాఖ్య
  • కాంగ్రెస్ పార్టీకి ద్వేషమనే దెయ్యం పూనుకుందని వ్యాఖ్య
  • కాంగ్రెస్ నేతలు యాంటీ ఇండియా ఎజెండాను కొనసాగిస్తున్నారని మండిపాటు

తెలంగాణ రైతులను కాంగ్రెస్ మోసం చేసిందని, ఎన్నికల సమయంలో రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రైతులను పట్టించుకోవడం లేదని ప్రధాని మోదీ మండిపడ్డారు. మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణలోని రైతులు ఇప్పుడు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ అత్యంత అవినీతిమయ పార్టీ అన్నారు.

తుక్డే తుక్డే గ్యాంగ్‌, అర్బ‌న్ న‌క్స‌ల్స్ ఆ పార్టీని నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి, మ‌హాత్మా గాంధీ లాంటి వ్య‌క్తితో లింకున్న పార్టీ కాదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ద్వేష‌మ‌నే దెయ్యం పూనుకుందన్నారు. నేటి కాంగ్రెస్ పార్టీలో దేశ‌భ‌క్తి అనే భావనే లేదన్నారు. కాంగ్రెస్ నేత‌లు యాంటీ ఇండియా ఎజెండాను కొన‌సాగిస్తున్నార‌ని మండిపడ్డారు. రిజ‌ర్వేష‌న్ వ్య‌వ‌స్థ‌పై అమెరికాలో వ్యాఖ్య‌లు చేసిన ఆ పార్టీ నేత‌ను సొంత పార్టీ నాయ‌కులే త‌ప్పుప‌డుతున్నార‌న్నారు. అవినీత‌మ‌మైన పార్టీ ఏదైనా ఉందంటే, అది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఆ పార్టీ కుటుంబ సభ్యులే పెద్ద అవినీతిపరులు అని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీ గణపతి పూజను కూడా ద్వేషిస్తోందన్నారు. గణపతి పూజకు వెళ్తే రాజకీయాలు ఆపాదించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో గణపతి బప్పాను జైల్లో వేశారని, ఓ విగ్రహాన్ని పోలీస్ వ్యాన్‌లో పెట్టారని ధ్వజమెత్తారు. గణపతి బప్పాకు జరిగిన అన్యాయంపై మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు మాట్లాడటం లేదని విమర్శించారు. కాంగ్రెస్ అంటేనే అబద్దాలు అని, మహారాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులను నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వకూడదన్నారు.

  • Loading...

More Telugu News