Jagan: మీవి తిరోగమన నిర్ణయాలు... మళ్లీ మొదటికే తీసుకెళుతున్నారు: జగన్

Jagan slams Chandrababu and Nara Lokesh

  • చంద్రబాబు, లోకేశ్ లపై జగన్ విమర్శనాస్త్రాలు
  • విద్యాసంస్కరణలను తుంగలో తొక్కుతున్నారని విమర్శలు
  • ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తున్నారంటూ ట్వీట్

వైసీపీ అధ్యక్షుడు జగన్ తాజాగా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ లపై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ విధానం రద్దుతో మీరు మరోసారి పేదల వ్యతిరేకి అని నిరూపించుకున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. 

ముఖ్యమంత్రిగా మీరు, విద్యాశాఖ మంత్రిగా మీ కుమారుడు తిరోగమన నిర్ణయాలతో ప్రభుత్వ స్కూళ్లను మళ్లీ మొదటికే తీసుకెళుతున్నారని విమర్శించారు. మీ ఇళ్లలో పిల్లలకు అత్యుత్తమ చదువులు అందించాలనుకుంటారు కానీ, ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల విషయంలో వివక్ష ఎందుకని ప్రశ్నించారు. 

ముఖ్యమంత్రిగా మీ 14 ఏళ్ల కాలంలో చేయలేని పనులన్నీ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిందని జగన్ పేర్కొన్నారు. నాడు-నేడు, ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ, ఐబీ, టోఫెల్, సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్, 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లు, విద్యాకానుక, రోజుకొక మెనూతో గోరుముద్ద... ఇలా వైసీపీ ప్రభుత్వం అనేక పథకాలు తీసుకువచ్చిందని వివరించారు.

కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ పథకాలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారని జగన్ ఆరోపించారు. మీ పార్టీ నేతలకు చెందిన ప్రైవేటు స్కూళ్లు బాగుండాలి, ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయిపోవాలి... ఇదేగా మీ ఉద్దేశం! అంటూ విమర్శించారు. 

నాడు మీరు విపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ మీరు, ఈనాడు న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకున్న తీరును ప్రజలు ఇంకా మర్చిపోలేదు అని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలను, ఆ స్కూళ్లలో పనిచేసే ఉపాధ్యాయులను తక్కువగా చూసే మీ మనస్తత్వాన్ని మార్చుకోండి చంద్రబాబు గారూ అంటూ జగన్ ట్వీట్ చేశారు. 

పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించే ఆయుధం చదువు మాత్రమే, అందుకే ప్రభుత్వ స్కూళ్లను నిర్వీర్యం చేసే పనులను తక్షణమే మానుకోండి... మేం తీసుకువచ్చిన విద్యా సంస్కరణలను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లండి... లేకపోతే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు అని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News