Army Officers Robbed: ట్రైనీ ఆర్మీ అధికారులను దోచుకుని వారి స్నేహితురాలిపై సామూహిక అత్యాచారం

Army Officers Robbed In Madhya Pradesh Their Woman Friend Gang Raped

  • మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఘటన
  • గాళ్‌ఫ్రెండ్స్‌తో వచ్చిన ఆఫీసర్లను చుట్టుముట్టిన సాయుధులు
  • తొలుత దాడి చేసి ఆపై ఇద్దరిని బందీలుగా తీసుకున్న దుండగులు
  • రూ. 10 లక్షలు తీసుకురావాలని మరో ఆఫీసర్‌ను వెనక్కి పంపిన వైనం
  • పోలీసులు, అధికారులు రావడం చూసి బందీలను వదిలి పరార్
  • మహిళపై సామూహిక అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇద్దరు యువ ట్రైనీ ఆర్మీ అధికారులు, వారి స్నేహితురాళ్లను సాయుధులు కొందరు దోచుకున్నారు. దుండగులు వారిపై దాడిచేసిన అనంతరం వారి స్నేహితురాళ్లపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ నేరానికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరికి ఇప్పటికే క్రిమినల్ రికార్డు ఉన్నట్టు తెలిపారు. 

ఎంహౌ ఆర్మీ కాలేజీలో శిక్షణలో ఉన్న వారు స్నేహితురాళ్లతో కలిసి మంగళవారం మధ్యాహ్నం చోటీజామ్‌లోని ఫైరింగ్ రేంజ్ వద్దకు వెళ్లారు. అక్కడ వారిని అకస్మాత్తుగా 8 మంది సాయుధులు చుట్టుముట్టారు. వారి చేతుల్లో పిస్తోలు, కత్తులు, కర్రలు ఉండడంతో అధికారులు, వారి స్నేహితురాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అందరూ కలిసి ట్రైనీ అధికారులపై దాడి చేసి వారి వద్దనున్న డబ్బులు, ఇతర వస్తువులను లాక్కున్నారు. 

ఆ తర్వాత ఒక అధికారి, ఒక మహిళను బందీగా తీసుకున్న దుండగులు మిగతా ఇద్దరిని రూ. 10 లక్షలు డిమాండ్ చేశారు. ఆ డబ్బును తీసుకురావాలని వారిని వెనక్కి పంపించారు. దీంతో భయపడిపోయిన అధికారి వెంటనే తమ యూనిట్‌కు వచ్చి తమ కమాండింగ్ అధికారికి విషయం చెప్పాడు. ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.  అందరూ కలిసి ఘటనా స్థలానికి వస్తుండడం చూసిన నిందితులు ఆర్మీ అధికారి, మహిళను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు.

ఆ తర్వాత నలుగురిని ఎంహౌ సివిల్ ఆసుపత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు అధికారులు ఇద్దరికీ గాయాలైనట్టు నిర్ధారించారు. అలాగే, మహిళపై సామూహిక లైంగికదాడి జరిగినట్టు నిర్ధారణ అయింది. బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News