Jagga Reddy: ఎమ్మెల్యే, ఎంపీ కావాలంటే రూ.100 కోట్ల వరకు ఖర్చు పెట్టాలి: జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jagga Reddy hot comments on MLA and MP seats

  • సంగారెడ్డి జనరల్ సీటుకు 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలన్న జగ్గారెడ్డి
  • ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందేనని వ్యాఖ్యలు
  • మహేశ్ కుమార్ గౌడ్ అందరినీ కలుపుకొని పోతారని ఆశాభావం
  • ఎప్పటికైనా పీసీసీ అధ్యక్షుడిని అవుతానన్న జగ్గారెడ్డి

ఎమ్మెల్యే, ఎంపీ కావాలంటే రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... "సంగారెడ్డి జనరల్ (ఎమ్మెల్యే) సీటుకి రూ.50 కోట్లు ఖర్చు పెట్టాలి.. పటాన్‌చెరు ఎమ్మెల్యే సీటుకి రూ.100 కోట్లు ఖర్చు పెట్టాలి. ఎంపీ సీటుకు కూడా రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఖ‌ర్చు పెట్టాలి. ఇప్పుడు కులాలతో రాజకీయం నడవడం లేదు. పైసలు పెట్టాల్సి వస్తోంది. ఇప్పుడు ఏ కుల‌మో, ఏ మ‌త‌మో త‌ర్వాత‌... ఎమ్మెల్యేలు, ఎంపీలు కావాలంటే ఇప్పుడు కోట్లు పెట్టాలి. పైసలకు కులానికి ఇప్పుడు సంబంధం లేదు" అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలామంది నేతలు పోటీ పడ్డారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. బీసీ నేత మహేశ్ కుమార్ గౌడ్‌కు ఏఐసీసీ పదవిని కట్టబెట్టిందన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఆయన అందరినీ కలుపుకొని పోతారని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలనే మహేశ్ కుమార్‌కు పదవిని ఇచ్చారన్నారు. 

తానూ పీసీసీ అధ్యక్షుడిని కావాలనుకున్నానని, ఎప్పటికైనా అయి తీరుతానన్నారు. కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ కాబట్టి ఎవరైనా పీసీసీ అధ్యక్షుడు కావొచ్చని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో తాను చాలా సంతోషంగా ఉన్నానన్నారు.

Jagga Reddy
Congress
Telangana
  • Loading...

More Telugu News