Rahul Dravid: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ హెడ్ కోచ్‌గా రాహుల్ ద్ర‌విడ్‌..!

Rahul Dravid Takes Up Head Coach Role With Rajasthan Royals

  • ఇప్ప‌టికే ద్ర‌విడ్‌తో ఫ్రాంచైజీ ఒప్పందం కుదిరిన‌ట్లు వార్త‌లు
  • ద్రవిడ్‌తో పాటు విక్రమ్ రాథోడ్‌ కూడా అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు
  • 2012, 2013లో ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఉన్న ద్ర‌విడ్
  • 2014, 2015 సీజన్‌లలో జట్టు డైరెక్టర్‌గా, మెంటార్‌గా సేవ‌లు

టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఐపీఎల్‌లో ఈసారి రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్‌) హెడ్‌ కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు ఇప్ప‌టికే ద్ర‌విడ్‌తో రాజ‌స్థాన్ చ‌ర్చ‌లు స‌ఫ‌లమైన‌ట్లు స‌మాచారం. ఇక ఇటీవ‌ల విండీస్‌, అమెరికా ఆతిథ్య‌మిచ్చిన‌ టీ20 ప్రపంచకప్ 2024 తో భార‌త్‌ను విజేత‌గా నిల‌ప‌డంతో ద్ర‌విడ్ కీల‌క పాత్ర పోషించాడు. ఆ త‌ర్వాత ఆయ‌న ప‌ద‌వి కాలం ముగియ‌డంతో టీమిండియా హెడ్ కోచ్‌గా త‌ప్పుకున్నాడు. 

కాగా, జాతీయ జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్ అంటే ఏడాదిలో క‌నీసం 8-10 నెలల పాటు టీమ్‌తోనే ఉండాల్సి ఉంటుంది. ఇలా ఎక్కువ సమయం ఫ్యామిలీకి దూరంగా ఉండ‌డం ఇష్టంలేక ద్ర‌విడ్ మ‌రోద‌ఫా భార‌త జ‌ట్టు కోచ్‌గా ఉండేందుకు అంగీక‌రించ‌లేదు. కానీ, ఐపీఎల్‌కి ఇంత స‌మ‌యం అవ‌స‌రం ఉండ‌దు. కేవ‌లం టోర్నీ జ‌రిగే 2-3 నెలలు మాత్రమే ఉంటే స‌రిపోతుంది. అందుకే ఈ దిశ‌గా ఆలోచించి ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకుని ఉంటాడ‌ని క్రీడా విశ్లేష‌కుల అభిప్రాయం. 

ఇక ఆర్ఆర్ కోచింగ్ స్టాఫ్‌లో ద్రవిడ్‌తో పాటు టీమిండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్ విక్రమ్ రాథోడ్‌ కూడా అసిస్టెంట్ కోచ్‌గా బాధ్యతలు చేపడ‌తార‌ని తెలుస్తోంది. అయితే, వీరిద్దరి రాకతో ఇప్ప‌టివ‌ర‌కు ఫ్రాంచైజీలో కీల‌క పాత్ర పోషించిన శ్రీలంక లెజెండ్‌ కుమార్ సంగక్కర ఇక‌పై ఆ జ‌ట్టు క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా కొనసాగ‌నున్నాడు. 

ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో నివేదిక ప్రకారం త్వ‌రలో జ‌రిగే మెగా వేలం కోసం స్క్వాడ్ ప్లానింగ్ ప్రారంభం కావడానికి ముందే రాహుల్‌ ద్రవిడ్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఒప్పందం కుదిరింద‌ని తెలుస్తోంది. 

మ‌రోవైపు ద్ర‌విడ్ జూనియర్ జట్టుకు కోచ్‌గా ఉన్నప్ప‌టి నుంచి రాజ‌స్థాన్ కెప్టెన్ సంజూ శాంస‌న్‌తో మంచి అనుబంధం ఉంది. అటు ఈ మాజీ కోచ్ రాయల్స్‌కు ఆటగాడిగా కూడా ప్రాతినిధ్యం వహించాడు. అతను 2012, 2013లో ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే 2014, 2015 సీజన్‌లలో జట్టు డైరెక్టర్‌గా, మెంటార్‌గా పనిచేశాడు. 

ఆ త‌ర్వాత ద్ర‌విడ్‌ 2016లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) మారాడు. 2019లో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు వ‌ర‌కు ఢిల్లీతోనే కొనసాగాడు. ఇక రెండేళ్ల త‌ర్వాత‌ ద్రవిడ్ 2021లో భారత పురుషుల క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించాడు. 

త‌న కోచింగ్‌లో టీమిండియాను ఐసీసీ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్‌, వ‌న్డే ప్రపంచ‌క‌ప్ ఫైన‌ల్‌, టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్‌కు తీసుకెళ్లి విజ‌య‌వంత‌మైన కోచ్‌గా ద్ర‌విడ్ నిలిచాడు.

  • Loading...

More Telugu News