Patolla Karthik Reddy: హైడ్రాను చూస్తుంటే గ్లాడియేటర్ సినిమా గుర్తుకు వస్తోంది: పటోళ్ల కార్తీక్ రెడ్డి

Patolla Karthik Reddy compares hydra with gladiator

  • సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో గ్లాడియేటర్ గేమ్ ఆడుతున్నారని ఎద్దేవా
  • ఓవైపు ఎల్ఆర్ఎస్‌ను తెచ్చి రెగ్యులరైజ్ చేస్తున్నారని వెల్లడి
  • మరోవైపు హైడ్రా ద్వారా కూల్చివేతలు చేపడుతున్నారని విమర్శలు
  • హైడ్రాను బీజేపీ ఎంపీలు ప్రశంసించడాన్ని తప్పుబట్టిన బీఆర్ఎస్ నేత

హైడ్రా డ్రామాను చూస్తుంటే గతంలో వచ్చిన గ్లాడియేటర్ సినిమా గుర్తుకు వస్తోందని బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో గ్లాడియేటర్ గేమ్ ఆడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు.

చెరువులను రక్షించాలని ప్రభుత్వం చెబుతోందని, అందుకే హైడ్రా అంటోందని, కానీ చిత్తశుద్ధి మాత్రం లేదన్నారు. ఈ ప్రభుత్వం రెండు నెలల క్రితం ఎల్ఆర్ఎస్‌ను తీసుకువచ్చిందని గుర్తు చేశారు. పాత రంగారెడ్డి జిల్లాలో చెరువుల్లో వేసిన లేఅవుట్‌లను ఎల్ఆర్ఎస్ కింద రెగ్యులరైజ్ చేస్తున్నారని గుర్తు చేశారు. 

రామంతాపూర్ చెరువులో ఉన్న లేఅవుట్‌లకు ఈ రోజుకీ డబ్బులు తీసుకొని ఎల్ఆర్ఎస్ ప్రాసెస్ చేస్తున్నారని ఆరోపించారు. అలాంటప్పుడు చెరువులను సంరక్షించాలనే చిత్తశుద్ధి ఎక్కడ కనిపిస్తోందన్నారు.

చెరువుల సంరక్షణ పేరుతో ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోందని విమర్శించారు. ఎల్ఆర్ఎస్ కింద ప్లాట్లను క్రమబద్ధీకరిస్తున్నారని, దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు.

"గ్లాడియేటర్ సినిమాలో, కొందరు రోమ్ చక్రవర్తి వద్దకు వెళ్లి, పరిస్థితులు బాగాలేవని చెబుతారు. ఆకలి చావులు ఉన్నాయని... పొరుగుదేశం వాళ్లు యుద్ధానికి వస్తున్నారని చెబుతారు. రోమ్‌ను కాపాడాలని వారు కోరుతారు. అప్పుడు ఆ చక్రవర్తి గ్లాడియేటర్ గేమ్స్ ఆడుదామని వారితో చెబుతాడట. ఈ ఆట ద్వారా ప్రజల దృష్టిని మరల్చవచ్చునని ఆయన ఉద్దేశం. ఈ రోజు తెలంగాణలోనూ అదే కనిపిస్తుంది." అని చురక అంటించారు.

తెలంగాణ గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. రుణమాఫీ అందరికీ కాలేదని... రైతుబంధు పథకానిది కూడా అదే పరిస్థితి అన్నారు. అందుకే వీటిని మరిచిపోవడానికి హైడ్రా పేరుతో గ్లాడియేటర్ గేమ్స్ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.

బీజేపీపై కూడా కార్తీక్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి బీ-టీమ్‌లా మాట్లాడుతున్నారని విమర్శించారు. హైడ్రాను ప్రశంసించడం విడ్డూరమన్నారు. కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని వారు తెలంగాణ మీద ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

  • Loading...

More Telugu News