Bengaluru Airport: ఎయిర్‌పోర్ట్ వెలుపల వేచిచూసి.. మాజీ భార్య ప్రియుడు బయటకు రాగానే..!

airport employee was killed at Bengaluru Airport

  • మాజీ భార్య ప్రియుడిని దారుణంగా హత్య చేసిన వ్యక్తి
  • పదునైన కత్తితో గొంతు కోయడంతో అక్కడికక్కడే మృతి
  • కెంపేగౌడ ఎయిర్‌పోర్టు వెలుపల షాకింగ్ ఘటన

బెంగళూరు మహానగరంలోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ వెలుపల బుధవారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ వ్యక్తి తన మాజీ భార్య ప్రియుడిని కిరాతకంగా హత్య చేశాడు. ఎయిర్‌పోర్టులో ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తి కోసం చాలా సేపు ఎదురుచూసిన నిందితుడు.. అతడు బయటకు వచ్చిన వెంటనే పదునైన కత్తితో గొంతు కోశాడు. దీంతో ఎయిర్‌పోర్టు ఉద్యోగి మృతి చెందాడు.

నిందితుడు పదునైన కత్తిని దాచిపెట్టి.. బస్సులో విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్నాక హత్య చేయాలనుకున్న వ్యక్తి బయటకు వచ్చే వరకు వేచి చూశాడు. తన మాజీ భార్యతో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతోనే నిందితుడు ఈ నేరానికి పాల్పడ్డాడు. కాగా హత్య అనంతరం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా హత్యకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మృతదేహం రక్తంతో తడిసిపోవడం వీడియోలో కనిపించింది.

కాగా నిందిత వ్యక్తి, అతడి మాజీ భార్య 2022లో విడిపోయారు. హత్యకు గురైన వ్యక్తితో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానమే వీరిద్దరి మధ్య గొడవలకు దారితీసింది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయారు. మాజీ భార్య ప్రియుడిగా భావిస్తున్న వ్యక్తి కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో ట్రాలీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడిని చంపేందుకు నిందితుడు గతంలో కూడా చాలాసార్లు ప్రయత్నించాడు.

  • Loading...

More Telugu News