CJI Chandrachud: అర్జెంటుగా ఐదొందలు పంపిస్తారా.. సీజేఐ పేరుతో ఆన్ లైన్ మోసం

SC files complaint against scammer impersonating CJI

  • ఢిల్లీలో ఓ వ్యక్తికి మెసేజ్ పంపించిన మోసగాడు
  • సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సీజేఐ
  • కేసు ఫైల్ చేసి నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

‘హాయ్, నేను సీజేఐని. ఇక్కడ కన్నాట్ ప్లేస్ లో ట్రాఫిక్ లో చిక్కుకున్నా. అర్జెంటుగా కోర్టుకు వెళ్లాలి. క్యాబ్ కోసం ఒక 500 రూపాయలు పంపించండి’ అంటూ మీ ఫోన్ కు మెసేజ్ వస్తే ఏంచేస్తారు? అంతపెద్ద మనిషి అడిగాడని వెనకాముందు ఆలోచించకుండా ఆన్ లైన్ లో డబ్బులు పంపిస్తారు కదా.. సరిగ్గా ఇలాగే ఊహించాడో చీటర్. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పేరుతోనే దోపిడీకి ప్రయత్నించాడు. అయితే, ఈ మెసేజ్ లను అందుకున్న వ్యక్తి స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ పోస్ట్ వైరల్ గా మారి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ దాకా చేరింది. వెంటనే స్పందించిన సీజేఐ.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ఆ నేరస్థుడి కోసం వెతుకుతున్నారు.

సీజేఐ పేరుతో పంపిన ఆ మెసేజ్ లో.. తాను కన్నాట్ ప్లేస్ లో ఉన్నానని, కోర్టులో జరగబోయే కొలీజియం మీటింగ్ కు అర్జెంటుగా వెళ్లాలని దుండగుడు పేర్కొన్నాడు. క్యాబ్ కోసం రూ.500 కావాలని, ఆ మొత్తం పంపిస్తే కోర్టుకు వెళ్లగానే తిరిగి పంపించేస్తానని కోరాడు. నమ్మకం కలిగించేందుకని చెప్పి ఆ మెసేజ్ ఐపాడ్ నుంచి పంపించినట్లు కలరింగ్ ఇచ్చాడు. కాగా, దేశంలో ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలోనే ఈ మెసేజ్ వెలుగుచూడడం గమనార్హం.

  • Loading...

More Telugu News