Jogulamba Gadwal District: గద్వాల బస్సులో పుట్టిన చిన్నారికి జీవితకాలంపాటు ఉచిత బస్సు పాస్

Free bus pass for baby who born in Gadwal bus

  • కండక్టర్ భారతి, నర్సు అలివేలు మంగమ్మను సత్కరించిన టీజీఎస్ఆర్టీసీ
  • నర్సుకు డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం
  • బస్సు పాస్‌లను గద్వాల డిపో మేనేజర్‌కు అందజేత

నిన్న రాఖీ పౌర్ణమి రోజున బస్సులో జన్మించిన చిన్నారికి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అద్భుతమైన బహుమతిని ఇచ్చింది. చిన్నారి జీవితకాలం పాటు తెలంగాణవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ అందించింది. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. అలాగే, గర్భీణీకి డెలివరీ చేసిన నర్సుకు డీలక్స్, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో ఏడాది పాటు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. కండక్టర్ భారతి, నర్సు అలివేలు మంగమ్మను సత్కరించి, నగదును బహూకరించారు.

ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో పుట్టిన పిల్లలకు జీవిత కాలపు ఉచిత బస్‌ పాస్‌ను ఇవ్వాలని గతంలో యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మేరకు... నిన్న పుట్టిన ఆడపిల్లకు బర్త్ డే గిప్ట్‌గా లైఫ్ టైం ఫ్రీ బస్ పాస్‌ను మంజూరు చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. అలాగే, కండ‌క్ట‌ర్‌తో పాటు గ‌ర్భిణి డెలివ‌రీకి సాయం చేసిన వ‌న‌ప‌ర్తిలోని మ‌ద‌ర్ అండ్ చైల్డ్ గ‌వ‌ర్న‌మెంట్ ఆసుపత్రి స్టాఫ్ న‌ర్స్ అలివేలు మంగ‌మ్మకు డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లోనూ ఏడాది పాటు ఉచితంగా ప్ర‌యాణించే బ‌స్ పాస్‌ను సంస్థ అందించినట్లు వెల్లడించారు.

ఆ ముగ్గురికి సన్మానం

బ‌స్సులో ప్ర‌యాణిస్తున్నప్పుడు పురిటినొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న గ‌ర్బిణికి కాన్పు చేసి మాన‌వ‌త్వం చాటుకున్న గ‌ద్వాల్ డిపోకు చెందిన కండ‌క్ట‌ర్ భార‌తి, డ్రైవ‌ర్ అంజిల‌తో పాటు న‌ర్సు అలివేలు మంగ‌మ్మ‌ను హైదరాబాద్ బస్ భవన్‌లో నేడు టీజీఎస్ఆర్టీసీ యాజ‌మాన్యం అభినందించింది. సంస్థ ఉన్నతాధికారులతో కలిసి సజ్జనార్ వారిని ఘనంగా సన్మానించి... న‌గ‌దు బ‌హుమ‌తులు అందించారు. పాప, నర్స్‌కు సంబంధించిన ఉచిత బస్ పాస్‌లను గద్వాల డిపో మేనేజర్ మురళీకృష్ణకు అందించారు.

ఏం జరిగిందంటే?

గద్వాల-వనపర్తి రూట్‌ పల్లె వెలుగు బస్సులో రాఖీ పండుగ రోజున సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్‌ సందర్భంగా సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళుతోంది. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి పురిటినొప్పులు వచ్చాయి. అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును నిలిపారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న నర్సు అలివేలు మంగ‌మ్మ సాయంతో గర్భిణికి పురుడు పోశారు. దాంతో ఆ గర్భిణి పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆసుపత్రికి తరలించారు. 

సమయస్పూర్తితో వ్యవహారించి సకాలంలో కాన్పు చేసిన కండ‌క్ట‌ర్ భార‌తి, న‌ర్సు అలివేలు మంగ‌మ్మ, డ్రైవ‌ర్ అంజి సేవలను ఈ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ మెచ్చుకున్నారు. ఆపద సమయంలో సేవాతత్పరతను ఆర్టీసీ సిబ్బంది చాటుతుండటం గొప్ప విషయమన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు... వారి ఆపద సమయంలో తాము ఉన్నామని భరోసా కల్పిస్తుండటం అభినందనీయమని ప్రశంసించారు.

  • Loading...

More Telugu News