Jail Slippers: 20 ఏళ్ల జైలు శిక్ష.. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తి.. కుటుంబానికి దగ్గర చేసిన జైలు చెప్పులు!

Jail slippers help reunite mentally challenged man with family

  • బావ హత్య కేసులో 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి
  • శిక్ష పూర్తికావడంతో ఇటీవల జైలు నుంచి విడుదల
  • మతి స్థిమితం కోల్పోడంతో ఎక్కడికెళ్లాలో తెలియక రైలెక్కి పశ్చిమ బెంగాల్‌కు
  • అతడు ధరించిన చెప్పులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసిన గ్రామస్థులు
  • పశ్చిమ బెంగాల్ రేడియో క్లబ్ చొరవతో మధ్య ప్రదేశ్‌లోని కుటుంబ సభ్యుల గుర్తింపు

కొన్ని ఘటనలు భలే విచిత్రంగా ఉంటాయి. ఆశ్చర్యం కలిగిస్తాయి. కొన్ని బంధాలు తెంచుకున్నా తెగనంత గట్టిగా ఉంటాయి. దశాబ్దాలుగా దూరంగా ఉన్నా.. విధే వారిని కలుపుతుంది. సరిగ్గా ఇలాంటిదే పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. బావ హత్య కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి దోషిగా తేలి 20 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాడు. ఆ తర్వాత అతడిని జైలు నుంచి విడుదల చేశారు. అయితే, అప్పటికే అతడు మానసిక స్థిమితం కోల్పోయాడు. అతడికి సంబంధించిన వస్తువులేమీ అతడి వద్ద లేకపోవడంతో జైలులో ధరించే చెప్పులు అతడు వేసుకుని వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. అవే అతడిని రెండు దశాబ్దాల తర్వాత కుటుంబానికి దగ్గర చేశాయి.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని నరసింహాపూర్‌కు చెందిన సురేశ్ ముడియా 20 ఏళ్ల క్రితం ఓ గొడవలో తన బావను బైక్‌పై నుంచి తోసేశాడు. తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత మరణించాడు. ఈ కేసులో అతడిని దోషిగా తేల్చిన న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

రైలెక్కి పశ్చిమ బెంగాల్‌కు
జైలు శిక్ష పూర్తి కావడంతో ఇటీవల అతడిని జైలు అధికారులు విడుదల చేశారు. అతడి కాళ్లకు చెప్పులు కూడా లేకపోవడంతో జైలులో ఇచ్చే చెప్పులతోనే అతడిని బయటకు పంపారు. అయితే, అప్పటికే అతడు మానసికంగా దెబ్బతినడంతో కుటుంబ వివరాలు మర్చిపోయాడు. ఎక్కడికి వెళ్లాలో తెలియక రైలెక్కి పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల జిల్లా చేరుకున్నాడు. అక్కడ కానింగ్-ఐ బ్లాక్‌లోని తకురానిబెరియాలో రోడ్డు పక్కన నిద్రపోయాడు. అతడి పక్కనే ఉన్న చెప్పులను చూసిన గ్రామస్థులు అవి జైలులో ఇచ్చే చెప్పులని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

బెంగాల్ రేడియో క్లబ్ కీలక పాత్ర
విచారణ అనంతరం అతడిని సురేశ్ ముడియాగా గుర్తించిన పోలీసులు.. కుటుంబంతో విడిపోయిన వారిని కలపడంలో సాయం చేసే ఔత్సాహిక రేడియో ఆపరేటర్ అయిన పశ్చిమ బెంగాల్ రేడియో క్లబ్ (డబ్లూబీఆర్‌సీ)ని సంప్రదించాలని గ్రామస్థులకు సూచించారు. వారు ఈ విషయాన్ని తమ రేడియోలో ప్రసారం చేశారు. ఆ వెంటనే వారికి ఓ గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్త ఫోన్ చేసి అటువంటి చెప్పులను ఖైదీలు వేసుకుంటారని, వాటిపై ఉన్న నంబర్ వారుండే సెల్‌కి సంబంధించినదని చెప్పాడు. 

ఫొటోను చూసి గుర్తుపట్టిన తల్లి
రేడియో క్లబ్ అతి కష్టం మీద అతడి వివరాలు సేకరించింది. అతడు మధ్యప్రదేశ్‌లోని నర్సింహాపూర్‌కు చెందినవాడని గుర్తించింది. గ్రామస్థులు కూడా అతడి ఫొటోను చూసి గుర్తుపట్టారు. అయితే, హత్యకేసు దోషి కావడంతో వివరాలు చెప్పేందుకు భయపడ్డారు. అతడి కుటుంబం మాత్రం గ్రామాన్ని విడిచి వెళ్లిపోయినట్టు చెప్పారు.

జైలును సంప్రదించడంతో కథ సుఖాంతం
రేడియో ప్రతినిధులు జైలును సంప్రదించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతడు సురేశ్ ముడియానేనని, ఆ చెప్పులు ధరించేందుకు తామే ఇచ్చామని చెప్పారు. దీంతో అతడి తల్లి కోసం గాలించి చివరికి కాంతిబాయి ముడియాను గుర్తించారు. కుమారుడి ఫొటో చూడగానే ఆమె కన్నీరు మున్నీరై అతడు జైలుకు ఎందుకు వెళ్లిందీ వివరించింది. 

తల్లి ఫొటో చూసి ఏడ్చేసిన సురేశ్
మరోవైపు పశ్చిమ బెంగాల్‌లో ఉన్న సురేశ్‌ను చేరదీసిన గ్రామస్థులు అతడికి ఆశ్రయం కల్పించి ఆహారం ఇస్తున్నారు. ఈ క్రమంలో వారికి అందిన అతడి తల్లి ఫొటోను చూపిస్తే గుర్తు పట్టి ఏడ్చేశాడు. అమ్మ దగ్గిరికి వెళ్తానంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ప్రస్తుతం అతడి కుటుంబ సభ్యులు పశ్చిమ బెంగాల్ వెళ్తున్నారు.

  • Loading...

More Telugu News