Sabarmati Express: రైలు పట్టాలపై బండరాయి.. ఢీకొట్టి పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్

Sabarmati Express Derails In Kanpur Uttar Pradesh

  • బండరాయి తాకడంతో ఇంజిన్ ధ్వంసం
  • పట్టాలు తప్పిన 22 బోగీలు
  • ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు
  • ప్రయాణికులను బస్సుల్లో గమ్యస్థానానికి చేర్చిన రైల్వే

వారణాసి నుంచి అహ్మదాబాద్ వెళ్తున్న సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్-భీంసేన్ స్టేషన్ల మధ్య ఈ తెల్లవారుజామున 2.29 గంటల సమయంలో 22 బోగీలు పట్టాలు తప్పాయి. అంటే దాదాపు రైలు మొత్తం పట్టాలు తప్పినట్టే. కాన్పూరు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన అరగంటకే ఈ ప్రమాదం సంభవించింది. కాగా, ఈ రైలు కంటే 9 నిమిషాల ముందు అదే మార్గం గుండా పాట్నా-ఇండోర్ రైలు సురక్షితంగా వెళ్లింది.

రైల్వే ట్రాక్‌పై ఉన్న వస్తువును ఇంజిన్ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగినట్టు రైల్వే అధికారులు తెలిపారు. అయితే, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టమూ సంభవించలేదని, ఒక్కరికి కూడా గాయాలు కాలేదని చెప్పారు.

సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు ఘటనా స్థలం వద్దకు బస్సులు పంపించారు. వాటి ద్వారా ప్రయాణికులను అహ్మదాబాద్ పంపే ప్రయత్నం చేశారు.  ఓ పెద్ద బండరాయి ఇంజిన్‌కు తాకడంతో అది బాగా దెబ్బతిందని, ప్రమాదానికి అదే కారణమని లోకో పైలట్ తెలిపాడు. రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో ప్రయాణించాల్సిన పదుల సంఖ్యలో రైళ్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.

  • Loading...

More Telugu News