Bandi Sanjay: కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ విలీనం... కేసీఆర్‌కు ఏఐసీసీ పదవి... కవితకు రాజ్యసభ: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay hot comments on Congress and BRS

  • సీఎం పదవిలో ఉండి రాజకీయ లబ్ధి కోసం కోర్టులపై బురద చల్లవద్దని సూచన
  • బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శ
  • కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్న

త్వరలో కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని, కేసీఆర్‌కు ఏఐసీసీ, కేటీఆర్‌కు పీసీసీ, కవితకు రాజ్యసభ సీటు రావడం ఖాయమని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనమవుతుందని, కవితకు బెయిల్ వస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బండి సంజయ్ ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.

ఆమ్ ఆద్మీ పార్టీని విలీనం చేసుకుంటేనే ఆ పార్టీ నేత మనీశ్ సిసోడియాకు బెయిల్ వచ్చిందా? అని ఎద్దేవా చేశారు. సీఎం పదవిలో ఉండి రాజకీయ లబ్ధి కోసం గౌరవ న్యాయస్థానంపై బురద జల్లి కోర్టుల ప్రతిష్ఠను దిగజార్చడం సరికాదన్నారు. బీజేపీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.

పొత్తు పెట్టుకొని పదవులు పంచుకున్న చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకే ఉందని గుర్తు చేశారు. ఇందులో బీజేపీకి ఏం సంబంధమో చెప్పాలన్నారు. బీఆర్ఎస్‌ను విలీనం చేస్తే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వమే అన్నారు. కవితకు బెయిల్ విషయంలో కావాలని బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్‌లను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అని నిలదీశారు.

బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయం అన్నారు. ప్రజలు ఛీత్కరించుకున్న పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ తమకు లేదన్నారు. బీఆర్ఎస్‌ను విలీనం చేసుకోవాలని కాంగ్రెస్ తహతహలాడుతోందన్నారు. పథకం ప్రకారమే ఆ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయని... కాంగ్రెస్‌ ఉబలాటం చూస్తుంటే కవితను రాజ్యసభకు పంపినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు.

ఆ పార్టీల తీరు "నేను కొట్టినట్లు చేస్తా... నువ్వు ఏడ్చినట్లు చెయ్" అన్నట్లుగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం సహా అనేక అంశాల్లో జరిగిన కోట్లాది రూపాయల అవినీతి, అక్రమాలను వెలికితీసి కేసీఆర్, కేటీఆర్‌లను జైలుకు పంపించాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

  • Loading...

More Telugu News