KTR: కేటీఆర్ 'బ్రేక్ డ్యాన్స్' వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్, విచారణకు ఆదేశం

Women commission serious on KTR comments

  • ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ సెటైర్లు
  • కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్
  • ఆయన వ్యాఖ్యలు మహిళలను బాధించేవిగా ఉన్నాయన్న చైర్ పర్సన్ శారద

ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. ఆయన చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళలను బాధించేవిగా ఉన్నాయని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. ఆయన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ సెటైర్లు వేశారు. బస్సులో కుట్లు-అల్లికలు వంటివి చేసుకుంటే తప్పేమిటని సీతక్క అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్... బస్సుల్లో కుట్లు, అల్లికలను తాము వద్దనడం లేదని, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు వేసుకున్నా తమకు అభ్యంతరం లేదని చురక అంటించారు. బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికులు తన్నుకుంటున్నారని, బస్సులను పెంచాలని కోరారు.

కేటీఆర్ ఏమన్నారంటే...?

"నిన్న మా సీతక్క చెబుతోంది... బస్సులో అల్లం వెల్లిపాయ ఏరితే తప్పా అని!... తప్పని మేమెక్కడ అన్నాం అక్కా... మేం అనలేదు... కాకపోతే దాని కోసమే బస్సు పెట్టారని మాకు తెలియక ఇన్నాళ్లు మేం మామూలుగా నడిపాం. మాకేమో తెలియకపాయే. మీరు అప్పుడే చెబితే బాగుండు. బస్సులో కుట్లు-అల్లికలు చేస్తే తప్పా? అని అడుగుతున్నారు. తప్పని మేం ఎందుకు అంటాం అక్కా... కానీ ఇంకా ఎక్కువ బస్సులు పెట్టు. సీట్ల కోసం తన్నుకుంటున్నారు... మనిషికో బస్సు పెట్టు. మేం ఎందుకు వద్దంటాం. మనిషికో బస్సు పెట్టు... కుటుంబం కుటుంబం అంతా పోయి అందులో కూర్చొని కుట్లు - అల్లికలు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు... రికార్డింగ్... ఏం చేస్తారో చేయండి.. మేం ఎందుకు వద్దాంటాం. కానీ ఈ రకంగా బస్సుల్లో కొట్టుకునే పరిస్థితి కేసీఆర్ ఉన్నప్పుడు ఉండేనా? ఇప్పుడు సిగలు పట్టుకునే పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు డ్రైవర్లు, కండక్టర్లు తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది" అన్నారు.

  • Loading...

More Telugu News