KTR: కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయి: కేటీఆర్

KTR lashes out at congress government over funds

  • తెలంగాణ పల్లెల్లో పాలన పడకేసిందన్న కేటీఆర్
  • పట్టణాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉందన్న మాజీ మంత్రి
  • ప్రభుత్వాల నుంచి నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు సంక్షోభంలో ఉన్నాయన్న కేటీఆర్

తెలంగాణ పల్లెల్లో పాలన పడకేసిందని, పట్టణాల్లోనూ పరిస్థితి దారుణంగా తయారైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలనలో పట్టణాలు, పల్లెలు కంపు కొడుతున్నాయన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పంచాయతీలకు, మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాలు, పట్టణాల్లో పరిస్థితి దారుణంగా ఉందని పత్రికల్లో వచ్చిన కథనాలను ట్వీట్‌లో పొందుపరిచారు. ప్ర‌జాపాల‌న అంటే ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌ట‌మేనా? అని ప్రశ్నించారు.

అటు కేంద్రం నుంచి, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోవడంతో పంచాయతీలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. పాత పనులకు ఎనిమిది నెలలైనా బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన తాజా మాజీ సర్పంచ్ ల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ నిర్వహణ అధ్వానంగా మారడంతో.. పల్లెల్లో ప్రజల జీవనం దినదిన గండంలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దోమల మందుకు కూడా నిధులు లేకపోవడంతో పంచాయతీల్లో డెంగ్యూ, మలేరియా విజృంభిస్తున్నాయన్నారు.

'పంచాయతీలకు నిధులివ్వకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనా.. మీ ప్రజాపాలన అంటే.. ?? నాడు.. బీఆర్ఎస్ పాలనలో ప్రతి నెలా పంచాయతీలకు ఠంచన్ గా రూ.275 కోట్లు విడుదల చేశాం.. నేడు.. పెండింగ్ బిల్లులు చెల్లించాలని అడిగిన పాపానికి 1,800 మాజీ సర్పంచ్ లపై నిర్బంధాలు.. అక్రమ అరెస్టులు..! 15వ ఆర్థిక సంఘం నుంచి అందిన రూ.500 కోట్ల నిధులను గ్రామ పంచాయతీలకు ఇంకెప్పుడు ఇస్తారు..? ఉపాధి హామీ పథకం, హెల్త్ మిషన్ నుంచి వచ్చిన రూ.2,100 కోట్ల కేంద్ర నిధులను ఎందుకు దారి మళ్లించారు..??  12,769 పంచాయతీల్లో పేరుకుపోయిన విద్యుత్ బకాయిలే రూ.4,305 కోట్లని అంచనా. వాటి పరిస్థితి ఏంటి..???' అని ప్రశ్నించారు.

దేశానికే పట్టుగొమ్మలుగా భావించే పల్లెలపై కాంగ్రెస్ పాలనలో ఎందుకింత నిర్లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో.. పల్లెల్లో పాలన పూర్తిగా పడకేస్తే.. ఇక పట్టణాలు పెను సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. గ్రేటర్‌తో పాటు.. రాష్ట్రంలోని 12 కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో జీహెచ్ఎంసీకి అరకొర నిధులు కేటాయించడంతో.. మహానగరంలో అభివృద్ధి పనులు పూర్తిగా మూలనపడిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ చెప్పుకునే ప్రజాపాలనలో.. పల్లె ప్రగతికి పాతరేసి.. పట్టణ ప్రగతిని అడ్రస్ లేకుండా చేసిన మాట నిజం కాదా? అని నిలదీశారు. మున్సిపాలిటీల్లో పెండింగ్ పనులకు మోక్షం లేదు.. కొత్త పనులకు ప్రణాళిక లేదని విమర్శించారు. నిధులు లేక పూర్తిగా నీరసించిన మున్సిపాలిటీల్లో కనీసం అత్యవసర మరమ్మతులకు కూడా పైసలు లేకపోవడం దుర్మార్గం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలంలో అధ్వానంగా మారిన రోడ్లతో ప్రతినిత్యం అవస్థలు పడుతున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

మున్సిపాలిటీల్లో రూ.1200 కోట్లకుపైగా ఉన్న పెండింగ్ బిల్లులను ఇంకెప్పుడు విడుదల చేస్తారో చెప్పాలన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్వయంగా పర్యవేక్షిస్తున్న మున్సిపల్ శాఖకే ఈ స్థాయిలో నిధుల కొరత ఉంటే.. ఇక ఇతర శాఖల దుస్థితి ఏమిటన్నారు. ఆగస్ట్ 15 లోపు బకాయిలు చెల్లించకపోతే ఆందోళనకు సిద్ధమవుతున్న మున్సిపల్ కాంట్రాక్టర్ల కష్టాలను తీర్చే తీరిక ఈ ప్రభుత్వానికి ఉందా?...కనీసం కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నుంచి పురపాలక శాఖను ఇప్పటికైనా గట్టెక్కించే ధైర్యం ఉందా??... మున్సిపాలిటీల్లో దెబ్బతిన్న రోడ్లు, పొంగిపొర్లుతున్న డ్రైనేజీల మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపట్టే ఆలోచన ఉందా?? అని ప్రశ్నల వర్షం కురిపించారు.

బీఆర్ఎస్ హయాంలో పదేళ్లు పచ్చగా కళకళలాడిన పల్లెలు, ప్రగతిపథంలో దూసుకుపోయిన పట్టణాలు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. మీ అసమర్థతకు, పాలనా వైఫల్యాలకు నిలువెత్తు నిదర్శనం ప్రస్తుత స్థితి అని... మీ చేతకానితనాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందనే విషయాన్ని మరిచిపోకండని కేటీఆర్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News